6 కోట్లతో మైనార్టీ విద్యార్థులకు రెసిడెన్షియల్ విద్య
ABN , Publish Date - Jun 15 , 2026 | 04:22 AM
మైనార్టీ విద్యార్థులకు రూ.6కోట్లతో అత్యుత్తమ రెసిడెన్షియల్ విద్యను అందించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చిందని మైనారిటీ సంక్షేమ మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్ చెప్పారు.
250 మందికి ప్రముఖ విద్యా సంస్థల్లో అడ్మిషన్లు: మంత్రి ఫరూఖ్
విజయవాడ అర్బన్, జూన్ 14(ఆంధ్రజ్యోతి): మైనార్టీ విద్యార్థులకు రూ.6కోట్లతో అత్యుత్తమ రెసిడెన్షియల్ విద్యను అందించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చిందని మైనారిటీ సంక్షేమ మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్ చెప్పారు. ‘తాలిమ్-ఏ-హునర్’ టాలెంట్ టెస్ట్లో ఉత్తీర్ణులైన 250 మంది ముస్లిం విద్యార్థులకు కాలేజీల్లో సీట్ల కేటాయింపు పత్రాలను ఆదివారం విజయవాడలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదరికంలో ఉన్న మైనార్టీ ఆడపిల్లలు, విద్యార్థులు డ్రాపౌట్ కాకుండా ఉండేందుకు వక్ఫ్బోర్డు రూ.6 కోట్లతో విద్యార్థులను చదివించేందుకు ముందుకు రావడం గొప్ప విషయమన్నారు. బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ ఈ టెస్ట్లో ఎంపికైన విద్యార్థులను విజయవాడ చైతన్య గోశాల క్యాంప్సలో చేర్పించి, ఉన్నత విద్య అందించనున్నట్టు ప్రకటించారు.