Share News

జనం చెవిలో.. జగన్‌ పూలు!

ABN , Publish Date - Aug 17 , 2026 | 03:43 AM

గ్రూప్‌-1.. రాష్ట్ర స్థాయిలో జరిగే అత్యున్నత ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ. ఎలాంటి సందేహాలకు తావు లేకుండా నిర్వహించాలి. కానీ జగన్‌ జమానాలో ఆద్యంతం అక్రమాలే.

జనం చెవిలో.. జగన్‌ పూలు!

  • 2018 గ్రూప్‌-1 పారదర్శకమంటూ రోతపత్రిక అడ్డగోలు కథనం

  • హైకోర్టు నియమించిన సిట్‌ నివేదికకు వక్రభాష్యం

  • మెయిన్స్‌ డిజిటల్‌ మూల్యాంకనంలో బార్‌కోడ్‌లు

  • తారుమారు అయినట్టు నివేదికలో పేర్కొన్న సిట్‌

  • పేరాలో మొదటి లైన్‌ తీసేసి జగన్‌ పత్రికలో అర్ధసత్యాలు

  • ‘హాయ్‌ల్యాండ్‌’లో మూల్యాంకనం జరగలేదనీ అబద్ధాలు

  • అక్కడ అడ్డగోలు దిద్దుడుపై సిట్‌ నివేదికలో స్పష్టీకరణ

  • ప్రైవేటు రిసార్ట్‌లో 84 రోజులు పేపర్లు ఎందుకుంచారు?

  • మూడో మూల్యాంకనంలోనూ వేరే ఇంకుతో సవరణలు

  • కొన్నింటికి ఎగ్జామినర్ల సంతకాలే లేవన్న సిట్‌

  • అయినా అత్యున్నత ప్రమాణాలంటూ ‘సాక్షి’ వక్రీకరణ

సాక్షి వాదన: అక్రమాలకు ఆధారాల్లేవని సిట్‌ చెప్పింది. బార్‌కోడ్‌ల తారుమారు, జవాబుపత్రాల మార్పిడి, మూల్యాంకనంలో అక్రమాలు జరగలేదని తేల్చింది.

వాస్తవం: నివేదికలోని అంశాల్లో ముందూ వెనుకా తొలగించి చేసిన వక్రీకరణ ఇది. సిట్‌ తన తుది ‘ఫైండింగ్స్‌’లో ఏం చెప్పిందంటే...

  • మాన్యువల్‌ మూల్యాంకనంపై తీసుకున్న విధాన నిర్ణయానికి సంబంధించిన తీర్మానం, నోట్‌ ఫైల్‌ ఏవీ దొరకలేదు.

  • 736 పత్రాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్స్‌కు పంపగా 95శాతం పత్రాల్లో సవరణలు, ఓవర్‌ రైటింగ్‌లు కనిపించాయి.

  • 21 ఓఎంఆర్‌ స్లిప్పుల్లో చేసిన సవరణలకు ఎగ్జామినర్‌ సంతకం లేదు. కొన్ని సంతకాలు ఎగ్జామినర్ల వాస్తవ సంతకాలతో సరిపోలలేదు.

  • కొన్ని పత్రాల్లో వేర్వేరు ఇంకులు వాడారు. సవరణల్లో వేరే చేతిరాత కూడా ఉంది.

  • కొన్ని ఓఎంఆర్‌ స్లిప్పుల్లో సవరణలకు చీఫ్‌ ఎగ్జామినర్‌ సంతకాలున్నాయి. ఇది ఏపీపీఎస్సీ నిబంధనలకు విరుద్ధం.

అమరావతి, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-1.. రాష్ట్ర స్థాయిలో జరిగే అత్యున్నత ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ. ఎలాంటి సందేహాలకు తావు లేకుండా నిర్వహించాలి. కానీ జగన్‌ జమానాలో ఆద్యంతం అక్రమాలే. మొదటిసారి నిర్వహించిన మెయిన్స్‌ పరీక్షల డిజిటల్‌ మూల్యాంకనంలో బార్‌కోడ్‌లు తారుమారు చేశారు. రెండోసారి ఏకంగా ప్రైవేటు రిసార్ట్‌ హాయ్‌ల్యాండ్‌కు జవాబుపత్రాలు తరలించి డేటా ఎంట్రీ ఆపరేటర్లతో కూడా మూల్యాంకనం చేయించారు. ఇక అభ్యర్థులను ఎంపిక చేసిన చివరిది, మూడో మూల్యాంకనంలో నిబంధనలకు విరుద్ధంగా వేరే ఇంకు వాడారు.


ఓఎంఆర్‌ స్లిప్పుల్లో పలు సవరణలకు ఎగ్జామినర్ల సంతాకాలే లేవు. చివరకు ఇంటర్వ్యూలోనూ అసాధారణంగా మార్కులు వేశారు. మెయిన్స్‌ పరీక్షల్లో టాపర్లకు తక్కువ మార్కులు, తక్కువ మార్కులు వచ్చిన వారికి ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కులు వేశారు. ఇవన్నీ.. జగన్‌కు గిట్టనివారో, టీడీపీవారో చేస్తున్న ఆరోపణలు కావు. హైకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన సిట్‌ నివేదికలో పేర్కొన్న వాస్తవాలు. వీటిపై చర్యలు తీసుకోవాల్సింది కూడా కోర్టే. కానీ 2018 గ్రూప్‌-1 పరీక్షల్లో అసలు అక్రమాలే జరగలేదని, అంతా పారదర్శకమంటూ జగన్‌ రోత పత్రిక అర్ధసత్యాలు, అబద్ధాలతో మొదటి పేజీలో ఓ పెద్ద కథను వండి వార్చింది. అక్రమాలు జరిగాయన్న సిట్‌ నివేదికను కూడా వక్రీకరించింది. ఆ నివేదిక వచ్చిన మూడ్రోజుల తర్వాత అందులోని వాస్తవాలను ప్రస్తావించకుండా, పేరాలో కొన్ని లైన్లు తీసేసి, అనుకూలంగా అనిపించే కొన్ని లైన్లు తీసుకుని అంతా సక్రమమేనంటూ అబద్ధాల కథను అచ్చేసింది. ‘డీఎస్సీలో ఏం జరగకపోయినా అక్రమాలు జరిగాయంటూ గగ్గోలు పెడదాం... గ్రూప్‌-1లో అక్రమాలు కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నా అవి మాత్రం పారదర్శకమంటూ ప్రచారం చేద్దాం’ అన్నట్టుగా జగన్‌ పత్రిక అడ్డగోలు వాదనకు దిగింది. అవాస్తవాల ప్రచారంతో ప్రజలను నమ్మించేందుకు యత్నించి అడ్డంగా దొరికిపోయింది. అది రాసిన అబద్ధాలు, సిట్‌ నివేదికలోని వాస్తవాలను పరిశీలిస్తే...


మొదటి లైన్‌ లేపేసి..

సాక్షి వాదన: ‘అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి తప్పులు జరగలేదని స్పష్టం చేస్తూ సిట్‌ నివేదికలో పేర్కొన్న భాగం’ అని నివేదికలోని 20 పేజీలో ఉన్న రెండో పాయింట్‌ను మొదటి పేజీలో ప్రచురించింది.

వాస్తవం: సిట్‌ నివేదికలో పేర్కొన్న ఆ పేరాలోని మొదటి లైనును ప్రచురించలేదు. ఎందుకంటే.. అక్కడే అసలు మతలబు ఉంది. మొదటిసారి జరిగిన డిజిటల్‌ మూల్యాంకనం గురించి ప్రస్తావిస్తూ ఆ పేరాలోని మొదటి లైనులో ‘స్కానింగ్‌ సమయంలో 287 జవాబు పత్రాల్లోని ప్రధాన ఓఎంఆర్‌ షీటుకు, దాని లోపలి పేజీల బార్‌కోడ్‌లలో వ్యత్యాసాలు ఉన్నాయి’ అని సిట్‌ స్పష్టంగా పేర్కొంది. కానీ జగన్‌ పత్రిక ఆ లైనును లేపేసి తెలివిగా రెండో వాక్యం నుంచి ప్రచురించింది. అసలు పేజీలే మారిపోయాయని సిట్‌ నివేదిక చెబుతుంటే.. అంతా పారదర్శకం అంటూ ప్రచారం మొదలుపెట్టింది. ‘బార్‌కోడ్‌ల మధ్య పొంతన లేకపోవడం అన్నది మానవ తప్పిదం గానీ, సాంకేతిక పొరపాటు గానీ కావొచ్చు’ అని సిట్‌ స్పష్టంగా పేర్కొంది.


చైర్మన్‌ అనుమతి లేకుండా...

సాక్షి వాదన: కోవిడ్‌ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్‌ మూల్యాంకనం జరిపించింది.

వాస్తవం: డిజిటల్‌ మూల్యాంకనం గురించి ఎక్కడా నోటిఫికేషన్‌లో పేర్కొనలేదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో డిజిటల్‌ మూల్యాంకనం చేయించాల్సి వస్తే ఆ సమాచారం అభ్యర్థులకు తెలియజేయాలి. కానీ అభ్యర్థులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అసలు అప్పటి ఏపీపీఎస్సీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఉదయభాస్కర్‌ అనుమతి కూడా తీసుకోలేదు.

ఉద్యోగాలే కోల్పోయారు

సాక్షి వాదన: ‘కొందరికి లబ్ధి చేకూర్చారన్న ఆరోపణలను సిట్‌ తోసిపుచ్చింది. మార్కుల లెక్కింపులో దొర్లిన పొరపాటును సరిదిద్దడం వల్ల మాత్రమే మార్కుల పెరుగుదల జరిగిందని నిర్ధారించింది. మూల్యాంకన స్లిప్‌పై జరిగిన ప్రతి మార్పును మోసపూరిత తారుమారుగా చూడ్డానికి వీల్లేదని సిట్‌ తేల్చి చెప్పింది’ అని రాసింది.

వాస్తవం: కొందరు అభ్యర్థులకు లబ్ధి చేకూరిందని సిట్‌ స్పష్టంగా పేర్కొంది. అందుకే ఇంటర్వ్యూల్లో వేసిన మార్కులను ప్రత్యేకంగా ప్రస్తావించింది. మెయిన్స్‌లో ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులకు ఇంటర్వ్యూల్లో తక్కువ మార్కులు వేశారు. మెయిన్స్‌లో తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులకు ఇంటర్వ్యూల్లో ఎక్కువ మార్కులు వేశారు. ఫలితంగా మెయిన్స్‌ మెరిట్‌ జాబితాలో టాప్‌లో ఉన్నవారు తుది మెరిట్‌లో చివరికి పడిపోయారు. మెయిన్స్‌లో ఎక్కడో చివరన ఉన్నవారు 50లోపు ర్యాంకులకు చేరారు. దీంతో కొందరు ఉద్యోగాలు నష్టపోతే, కొందరికి మంచి ఉద్యోగాలు లభించలేదు.


‘హాయ్‌ల్యాండ్‌’లో దిద్దుడు పచ్చినిజం

సాక్షి వాదన: ‘హాయ్‌ల్యాండ్‌లో మూల్యాంకనమే జరగలేదు. కోవిడ్‌ నేపథ్యంలో హైకోర్టు సూచనలతో మాన్యువల్‌ మూల్యాంకనానికి ఏపీపీఎస్సీ సిద్ధమైంది. ఇందుకోసం హాయ్‌ల్యాండ్‌ను ఎంచుకున్నారు. అయితే అక్కడ మూల్యాంకనం జరగలేదు. కానీ డేటాఎంట్రీ ఆపరేటర్లతో పేపర్లు దిద్దించారు అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు’ అని రాసింది.

వాస్తవం: మొత్తం మూడుసార్లు మూల్యాంకనం జరిగిందని, రెండోసారి హాయ్‌ల్యాండ్‌లో జరిగిందని సిట్‌ స్పష్టంగా నివేదికలో పేర్కొంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉంచాల్సిన కీలకమైన గ్రూప్‌-1 జవాబుపత్రాలను ప్రైవేటు రిసార్ట్స్‌కు తరలించారు. అప్పటి కమిషన్‌ కార్యదర్శి పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు ఆధ్వర్యంలో ఈ తతంగం జరిగింది. పీఎ్‌సఆర్‌ మిత్రుడు, జగన్‌ కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసార బాధ్యతలు చూసే కామ్‌సైన్‌ మధు, మరో ప్రైవేటు వ్యక్తి మహంకాళి రఘురామ్‌ ఆధ్వర్యంలో 84 రోజులు రిసార్ట్స్‌లో అభ్యర్థుల జాతకాలను ఉంచారు. అసలు 84 రోజులు ఒక ప్రైవేటు రిసార్ట్‌లో, ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో జవాబుపత్రాలు ఎలా ఉంచారు? చరిత్రలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? అనేదాన్ని సాక్షి ఎక్కడా ప్రస్తావించలేదు. హాయ్‌ల్యాండ్‌ మూల్యాంకనం గురించి సిట్‌ ఏం చెప్పిందంటే...

  • కామ్‌సైన్‌ మీడియా ఆధ్వర్యంలో 84 రోజులు జవాబుపత్రాలను హాయ్‌ల్యాండ్‌లో ఉంచారు.

  • ఎగ్జామినర్లు సంతకాలు చేయాల్సిన చోట డేటా ఎంట్రీ ఆపరేటర్లు సంతకాలు చేశారు.

  • అక్కడ ఎగ్జామినర్లే లేరు. వారికి బదులుగా డేటా ఎంట్రీ ఆపరేట్లను నియమించుకున్నారు. వారిలో ఎలక్ర్టీషియన్లు, ప్రైవేటు టీచర్లు, సెక్యూరిటీ గార్డులు, క్లర్క్‌లు, గృహిణులు, ప్రైవేటు ఉద్యోగులున్నారు.

  • డేటా ఎంట్రీ ఆపరేటర్లతో హాయ్‌ల్యాండ్‌లో మూల్యాంకనం చేయించారని ఇంటరి ఉండేవారు. వైసీపీ హయాంలో సంస్కరణలు చేసి మూడు బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతో 24 మంది ఐఏఎస్‌, ఐపీఎస్‌లు ఇంటర్వ్యూలు చేశారు.


నిబంధనలకు తూట్లు

సాక్షి వాదన: విజయవాడలో జరిగిన మాన్యువల్‌ మూల్యాంకనం గురించి ప్రస్తావిస్తూ... ‘ఓఎంఆర్‌ షీట్‌లో సవరణలు ఎగ్జామినర్లే చేశారని, బయటి వ్యక్తులు మార్చే అవకాశమే లేదని తేల్చి చెప్పిన సిట్‌’ అని 71వ పేజీలోని పేరాను ప్రచురించింది.

వాస్తవం: ఆ పేరా.. ఉద్యోగాలకు ఎంపికైన 165 మంది అభ్యర్థుల ఫోరెన్సిక్‌ నివేదికకు సంబంధించింది మాత్రమే. దీనికి సంబంధించి పేజీ 69లో సిట్‌ గుర్తించిన అంశాలను పేర్కొంది. అవి ఏంటంటే...

  • 165 మందిలో 160 (96.97శాతం) మంది సమాధాన పత్రాల ఓఎంఆర్‌లలో సవరణలు జరిగాయి. కేవలం ఐదుగురి పత్రాల్లోనే మార్పులు జరగలేదు.

  • 16 సవరణల్లో సంబంధిత ఎగ్జామినర్‌ సంతకాలే లేవు.

  • నిబంధనల ప్రకారం చీఫ్‌ ఎగ్జామినర్‌ సవరణలు చేయకూడదు. ఎగ్జామినర్లే సవరణలు చేయాలి. కానీ 87 వాల్యుయేషనల్‌ స్లిప్పుల్లో చీఫ్‌ ఎగ్జామినర్ల సంతకాలతో సవరణలు చేశారు.

  • 46 మంది అభ్యర్థుల పత్రాల్లో వేరే ఇంకుతో సవరణలు చేశారు. ఇది కమిషన్‌ నిబంధనలకు విరుద్ధం.

  • ఇంత భారీస్థాయిలో సమాధాన పత్రాల్లో సవరణలు జరిగితే అవన్నీ ఎగ్జామినర్లే చేశారని, సంతకాలు లేకపోవడం కేవలం పొరపాటుగా చూడాలని సాక్షి వక్రభాష్యం ఇస్తోంది.

Updated Date - Aug 17 , 2026 | 03:45 AM