Vemana Jayanti: వేల మంది నోట.. ‘వినుర వేమా’
ABN , Publish Date - Jan 20 , 2026 | 04:30 AM
శ్రీసత్యసాయి జిల్లా గాండ్లపెంట మండలం కటారుపల్లిలో యోగి వేమన జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు.
శ్రీసత్యసాయి జిల్లా కటారుపల్లిలో 20 వేల మందితో వేమన పద్యాలాపన
ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
కదిరి, జనవరి 19(ఆంధ్రజ్యోతి): శ్రీసత్యసాయి జిల్లా గాండ్లపెంట మండలం కటారుపల్లిలో యోగి వేమన జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వేమన పద్యాల సామూహిక ఆలాపనకు ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కింది. ఈ కార్యక్రమంలో 20 వేల మందికి పైగా ప్రజలు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. యోగి వేమన పద్యాలాపనకు ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం కల్పిస్తున్నామని ఆ సంస్థ ప్రతినిధులు వేదికపై ప్రకటించారు. సంబంధిత ధ్రువీకరణ పత్రాన్ని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్కు అందించారు. వేడుకల్లో పాల్గొన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మాట్లాడుతూ మానవతా విలువలు చాటిన మహనీయుడు ప్రజాకవి యోగివేమన అని కొనియాడారు. సామాజిక చైతన్యమే లక్ష్యంగా పద్యాలను రాశారని అన్నారు. అంతకుముందు వేమన సమాధి వద్ద మంత్రి సవిత, కలెక్టర్ శ్యామ్ప్రసాద్, హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, కదిరి ఎమ్మెల్యే వెంకటప్రసాద్, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు తదితరులు నివాళులర్పించారు.