19 మంది సివిల్ జడ్జీలకు సంస్థాగత శిక్షణ పూర్తి
ABN , Publish Date - Apr 05 , 2026 | 04:31 AM
నాల్గవ బ్యాచ్లో 19 మంది సివిల్ జడ్జిలు (జూనియర్ డివిజన్) ఏడాది పాటు ప్రాథమిక కోర్సును పూర్తి చేసుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ గ్రామంలోని ఏపీ జ్యూడీషియల్...
మంగళగిరి సిటీ, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి): నాల్గవ బ్యాచ్లో 19 మంది సివిల్ జడ్జిలు (జూనియర్ డివిజన్) ఏడాది పాటు ప్రాథమిక కోర్సును పూర్తి చేసుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ గ్రామంలోని ఏపీ జ్యూడీషియల్ అకాడమీలో శనివారం సంస్థాగత శిక్షణ ముగింపు సమావేశం జరిగింది. ఏపీ జ్యూడీషియల్ అకాడమీ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ అధ్యక్షుడు జస్టిస్ రవినాథ్ తిల్హరి, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుబ్బారెడ్డి సత్తి, జ్యుడీషియల్ అకాడమీ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ సభ్యుడు జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ హాజరై శిక్షణ పూర్తిచేసుకున్న జడ్జీలకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఏడాది శిక్షణలో హైకోర్టు, జిల్లా న్యాయమూర్తులు, ఫోరెన్సిక్, సాంకేతిక, వైద్య నిపుణులు, పోలీసు అధికారులు, హైకోర్టు రిజిస్ట్రార్లు, అకాడమీలోని ఇన్ హౌస్ ఫ్యాకల్టీతో సెషన్లు నిర్వహించారు. అలాగే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, ఫారెస్ట్ అకాడమీ, సెంట్రల్ జైలు, ల్యాండ్ సర్వే విభాగంతోపాటు న్యాయపంపిణీ వ్యవస్థతో అనుసంధానించబడిన పలు సంస్థలను సివిల్ జడ్జిలు సందర్శించారు. సమావేశంలో ఏపీ జ్యూడీషియల్ అకాడమీ డైరెక్టర్ చింతలపూడి పురుషోత్తమ్ కుమార్, అకాడమీ న్యాయాధికారులు పాల్గొన్నారు.
జూనియర్ సివిల్ జడ్జి ఫలితాలు ప్రకటన
అమరావతి, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి): జూనియర్ సివిల్ జడ్జి ఫలితాలను హైకోర్టు రిజిస్ట్రార్ (నియామకాలు) ప్రకటించారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 40 మంది, బదిలీ ప్రక్రియ ద్వారా ఒకరు ఎంపికయ్యారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్లో 50 జూనియర్ సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి గతేడాది అక్టోబరు 11, 12 తేదీల్లో హైకోర్టు రాతపరీక్షలు నిర్వహించింది. ఆ తర్వాత ఇంటర్వ్యూలు నిర్వహించింది. మొత్తం 40 జూనియర్ సివిల్ జడ్జి పోస్టులకుగానూ 30 మంది మహిళా న్యాయవాదులు ఎంపికయ్యారు.