పోలీస్ సీనియారిటీపై 13 ఏళ్ల వివాదానికి తెర
ABN , Publish Date - Sep 19 , 2026 | 05:39 AM
పోలీసు శాఖలో సీనియారిటీపై 13 సంవత్సరాలుగా కొనసాగుతున్న వివాదం ఎట్టకేలకు ముగిసింది. 2013 ప్యానెల్ సంవత్సరం నుంచి సెప్టెంబరు 1వ తేదీని ‘సీ-లిస్ట్’ అర్హత తేదీగా పరిగణిస్తూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల హెడ్ కానిస్టేబుళ్ల(హెచ్సీ) సీనియారిటీని సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
హెచ్సీల సీనియారిటీ జాబితాల సవరణ
‘సీ-లిస్ట్’ అర్హత తేదీగా సెప్టెంబరు 1
అమరావతి, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): పోలీసు శాఖలో సీనియారిటీపై 13 సంవత్సరాలుగా కొనసాగుతున్న వివాదం ఎట్టకేలకు ముగిసింది. 2013 ప్యానెల్ సంవత్సరం నుంచి సెప్టెంబరు 1వ తేదీని ‘సీ-లిస్ట్’ అర్హత తేదీగా పరిగణిస్తూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల హెడ్ కానిస్టేబుళ్ల(హెచ్సీ) సీనియారిటీని సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాను ఆదేశిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996లోని రూల్ 24 ప్రకారం నిర్ణీత విధానాన్ని పాటించి జాబితాలు ఖరారు చేయాలంటూ పోలీసు కమిషనర్లు, జిల్లాల ఎస్పీలకు వెంటనే డీజీపీ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ‘పాతికేళ్లయినా హెడ్ కానిస్టేబుళ్లుగానే ఉన్నారు. పదవీ విరమణ నాటికైనా వారికి ప్రమోషన్ దక్కేనా?’ అంటూ ఈ ఏడాది మే మొదటి వారంలో ‘ఆంధ్రజ్యోతి’ సమస్యను వెలుగులోకి తీసుకొచ్చింది. తక్షణమే స్పందించిన డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా సివిల్, ఏఆర్ పోలీసుల మధ్య ఉన్న సెప్టెంబరు 1, జనవరి 1 సమస్యపై సుదీర్ఘంగా చర్చించారు. దీంతో సమస్య కొలిక్కి వచ్చింది.