ప్రాణం మీదకు తెచ్చిన మైసూరు బజ్జీలు
ABN , Publish Date - May 14 , 2026 | 04:57 AM
పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం ఎస్.కొండేపాడులో కలుషిత ఆహారం తిన్న 13 మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు.
తిన్న వెంటనే 13 మందికి అస్వస్థత.. ఆసుపత్రుల్లో బాధితులకు కలెక్టర్ పరామర్శ
గణపవరం, మే 13 (ఆంధ్రజ్యోతి): పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం ఎస్.కొండేపాడులో కలుషిత ఆహారం తిన్న 13 మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. నిడమర్రు సీఐ నక్కా రజనీకుమార్, గణపవరం ఎస్సై మణికుమార్ కథనం మేరకు గ్రామానికి చెందిన మిరియాల మణికంఠ నాని రొయ్యల చెరువు వద్ద పనిచేస్తుంటాడు. బుధవారం మధ్యా హ్నం తన దగ్గర ఉన్న మైదాపిండిని తన బంధువైన ముఖమట్ల కనకదుర్గకు ఇచ్చాడు. అందులో కొంత ఆమె తన ఇరుగుపొరుగు వారికి కూడా పంచి పెట్టింది. ఆ పిండితో మైసూరు బజ్జీలు చేసుకుని తిన్న 13 మంది అపస్మారక స్థితిలోకి వెళ్లగా తొమ్మిది మందిని భీమవరం, మిగిలిన వారిని తణుకులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బాధితుల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆసుపత్రులకు వెళ్లి బాధితులను పరామర్శించారు.