Minister Farooq: కడప ఇస్తేమాకు 1.25 కోట్లు విడుదల
ABN , Publish Date - Jan 20 , 2026 | 05:07 AM
కడపలో మూడు రోజులపాటు జరగనున్న ఇస్తేమా నిర్వహణ ఏర్పాట్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1.25 కోట్లు విడుదల చేసింది.
ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి ఫరూక్
అమరావతి, జనవరి 19(ఆంధ్రజ్యోతి): కడపలో మూడు రోజులపాటు జరగనున్న ఇస్తేమా నిర్వహణ ఏర్పాట్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1.25 కోట్లు విడుదల చేసింది. కొప్పర్తి పారిశ్రామికవాడ సమీపంలో ఈ నెల 23, 24, 25 తేదీల్లో జాతీయ స్థాయి తబ్లిగి జమాతే ఇస్తేమా నిర్వహిస్తున్నారు. దీనికి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ముస్లింలు హాజరవుతారు. ఈ నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు. సోమవారం ఈమేరకు ఆయన ఓ ప్రకటన చేశారు. రాష్ట్ర హజ్ కమిటీ ద్వారా ప్రభుత్వం విడుదల చేసిన రూ.1.25 కోట్లు మొత్తాన్ని కడప కలెక్టర్ బ్యాంకు ఖాతాకు జమ చేసిందన్నారు. ఇస్తేమాకు నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబుకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ స్థాయిలో జరిగే ఈ కార్యక్రమానికి తరలివస్తున్న వాహనాలకు రాష్ట్ర ప్రవేశ పన్నును మినహాయించాలని రవాణా మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డిని కోరుతూ లేఖ రాసినట్లు ఫరూక్ పేర్కొన్నారు. కాగా, మైనార్టీల సంక్షేమానికి 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రతిపాదనపై మంత్రి ఫరూక్ సోమవారం సంబంధిత అధికారులతో సమీక్షించారు. కూటమి ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి ఇస్తున్న అత్యధిత ప్రధాన్యతను దృష్టిలో పెట్టుకుని అందుకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పన చేయాలని మంత్రి సూచించారు.