116 ఏళ్ల వయసులో మెట్ల మార్గంలో తిరుమలకు!
ABN , Publish Date - Jul 05 , 2026 | 04:21 AM
‘ఏజ్ ఈజ్ ఎ నంబర్’.. (వయసు ఒక అంకె మాత్రమే).. అని నిరూపిస్తోంది వందేళ్లు పైబడిన ఓ బామ్మ! 116 ఏళ్ల ఆ వృద్ధురాలు తిరుమలకు మెట్ల మార్గంలో..
3500 మెట్లు.. 11 కి.మీ. నడిచి విజయవంతంగా కొండపైకి చేరిన వృద్ధురాలు
తిరుమల, జూలై 4(ఆంధ్రజ్యోతి): ‘ఏజ్ ఈజ్ ఎ నంబర్’.. (వయసు ఒక అంకె మాత్రమే).. అని నిరూపిస్తోంది వందేళ్లు పైబడిన ఓ బామ్మ! 116 ఏళ్ల ఆ వృద్ధురాలు తిరుమలకు మెట్ల మార్గంలో కాలినడకన చేరుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది!. కుటుంబ సభ్యుల సహకారంతో.. చిన్న సంచి చేతపట్టి స్వామి క్షేత్రానికి.. అలిపిరి మార్గంలో మెట్లెక్కుతున్న ఆ వృద్ధురాలిని ఓ యువతి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయింది. అలిపిరి మెట్లమార్గం అంటే.. దాదాపు 3500 మెట్లు.. 11 కిల్లోమీటర్ల దూరం! ‘ఈ వయస్సులో మెట్లు ఎక్కడమా.. మరుజన్మలోనూ మీరు స్వామిని కలుస్తారు.. మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం.. ఇది శ్రీవారి మహిమే.. ఇది సాధారణ విషయం కాదు.. స్వామి లీలల్లో ఇదొకటి’ అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కర్ణాటక రాష్ర్టానికి చెందిన ఆ వృద్ధురాలు కుటుంబ సభ్యుల సహకారంతో రెండురోజుల క్రితం తిరుమలకు వచ్చినట్టు ఆ వీడియో ద్వారా తెలుస్తోంది. ఆమె ఊరు, పేరు మాత్రం తెలియరాలేదు.