నవనీతమ్మకు వీఐపీ దర్శనం
ABN , Publish Date - Jul 07 , 2026 | 04:20 AM
116 ఏళ్ల వృద్ధ భక్తురాలు నవనీతమ్మ సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమెతో పాటు కుటుంబ సభ్యులకూ టీటీడీ ప్రత్యేక దర్శనం కల్పించింది..
ఆమె కుటుంబసభ్యులకూ అవకాశం కల్పించిన టీటీడీ
లడ్డూ ప్రసాదాలు అందజేసిన ఈవో
తిరుమల, జూలై 6(ఆంధ్రజ్యోతి): 116 ఏళ్ల వృద్ధ భక్తురాలు నవనీతమ్మ సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమెతో పాటు కుటుంబ సభ్యులకూ టీటీడీ ప్రత్యేక దర్శనం కల్పించింది. ఇటీవల నవనీతమ్మ కాలినడకన తిరుమలకు వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సీఎం చంద్రబాబు కూడా తన ‘ఎక్స్’ ఖాతాలో ఆ వీడియోను పోస్ట్ చేసి కొనియాడారు. ఆ వృద్ధురాలి వివరాలు తెలియజేయాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కూడా సామాజిక మాధ్యమాల ద్వారా కోరారు. ఎట్టకేలకు విజిలెన్స్ అధికారులు ఆమె చెన్నైకి చెందిన నవనీతమ్మగా గుర్తించారు. చైర్మన్ ఆదేశాల మేరకు చైర్మన్ కోటాలోనే నవనీతమ్మతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించారు. చైర్మన్ కార్యాలయ సిబ్బంది దగ్గరుండి నవనీతమ్మను బయోమెట్రిక్ నుంచి ఆలయంలోకి తీసుకెళ్లి స్వామి దర్శనం చేయించారు. అనంతరం రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వచనం అందించగా టీటీడీ ఈవో రవిచంద్ర ఆమెకు లడ్డూప్రసాదాలు అందజేసి కాళ్లకు నమస్కరించారు.