kumaram bheem asifabad- పూజలు.. అన్నదానాలు
ABN , Publish Date - Aug 31 , 2025 | 11:14 PM
జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన గణనాధుల వద్ద ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మండలీల నిర్వాహకులు అన్నాదానం చేశారు. జిల్లా కేంద్రంలోని వివిధ వినాయక మండపాల వద్ద ఆదివారం అన్నదానాలు జోరుగా కొనసాగాయి
ఆసిఫాబాద్రూరల్, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన గణనాధుల వద్ద ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మండలీల నిర్వాహకులు అన్నాదానం చేశారు. జిల్లా కేంద్రంలోని వివిధ వినాయక మండపాల వద్ద ఆదివారం అన్నదానాలు జోరుగా కొనసాగాయి. వినాయకులను ప్రతిష్ఠించి ఐదు రోజులు అయిన నేపథ్యంలో ఉదయం నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించి మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. జిల్లా కేంద్రంలోని కేశవనాథ ఆలయంలో బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో, సిద్ది వినాయక నగర్, రాజంపేట, కస్సాబ్వాడి, కంచుకోటలలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దస్నాపూర్లో ప్రతిష్ఠించిన వినాయకుడి వద్ద వేద పండితులు సాయి ఆధ్వర్యంలో నిర్వహించిన కుంకుమార్చన పూజలో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సిర్పూర్(టి), (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని గొల్లవాడలో ప్రతిష్ఠించిన గణేశ్ మండలి వద్ద ఆదివారం మహిళలు కుంకుమార్చన పూజలు నిర్వహించారు. గొల్లవాడలో గణేష్ మండలి ఏర్పాటు చేసిన 30 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని బాల గణేశ్మండలి వద్ద ఆదివారం భక్తులు 21 రకాల నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రులను పురస్కరించుకుని ప్రతి రోజు రకరకాల పూజలతో నైవేద్యాలు సమర్పిస్తున్నారు.
కెరమెరి,(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రతిష్ఠించిన గణేశ్ మండలీల వద్ద భక్తులు ప్రత్యేక పూజుల్లో పాల్గొన్నారు. ప్రతి రోజు ప్రత్యేక పూజలు అన్నదానాలు నిర్వహిస్తున్నారు. అలాగే రాత్రి సమయాల్లో భజనలు నిర్వహిస్తున్నారు.