Share News

kumaram bheem asifabad- నామినేషన్‌ విత్‌డ్రా చేసుకోండి

ABN , Publish Date - Dec 05 , 2025 | 10:43 PM

కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా చింతలమానేపల్లి మండలం రన్‌వెల్లిలో గ్రామ సర్పంచ్‌ నామినేషన్‌ వేసిన అభ్యర్థి నామినేషన్‌ విత్‌డ్రా చేసుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని దళం పేరుతో ఓ ఉత్తరం రావడం కలకలం రేపింది. రన్‌వెల్లి సర్పంచ్‌ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మద్దతుతో జాడి దర్శన అనే మహిళ నామినేషన్‌ వేసింది. దర్శన మామ బాబు పశువుల కాపరి కావడంతో పశువులు మేపేందుకు ప్రాణహిత కెనాల్‌ వద్దకు వెళ్లాడు. గురువారం సాయంత్రం సమయంలో బైక్‌పై వచ్చిన వ్యక్తి బాబు తలకు తుపాకి గురి పెట్టి తాను ఇచ్చిన ఉత్తరాన్ని కొడుకు రంజిత్‌ (దర్శన భర్త)కు ఇవ్వాలని బాబును బెదిరించాడు

kumaram bheem asifabad- నామినేషన్‌ విత్‌డ్రా చేసుకోండి
గ్రామంలో కవాతు నిర్వహిస్తున్న పోలీసులు

కౌటాల (చింతలమానేపల్లి), డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా చింతలమానేపల్లి మండలం రన్‌వెల్లిలో గ్రామ సర్పంచ్‌ నామినేషన్‌ వేసిన అభ్యర్థి నామినేషన్‌ విత్‌డ్రా చేసుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని దళం పేరుతో ఓ ఉత్తరం రావడం కలకలం రేపింది. రన్‌వెల్లి సర్పంచ్‌ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మద్దతుతో జాడి దర్శన అనే మహిళ నామినేషన్‌ వేసింది. దర్శన మామ బాబు పశువుల కాపరి కావడంతో పశువులు మేపేందుకు ప్రాణహిత కెనాల్‌ వద్దకు వెళ్లాడు. గురువారం సాయంత్రం సమయంలో బైక్‌పై వచ్చిన వ్యక్తి బాబు తలకు తుపాకి గురి పెట్టి తాను ఇచ్చిన ఉత్తరాన్ని కొడుకు రంజిత్‌ (దర్శన భర్త)కు ఇవ్వాలని బాబును బెదిరించాడు. బాబు భయంతో ఊర్లోకి పరిగెత్తి కుటుంబ సభ్యులకు విషయం తెలిపాడు. దీంతో వారు కౌటాల సీఐ సంతోష్‌కు ఫిర్యాదు చేశారు. సీఐ సంతోష్‌ శుక్రవారం రన్‌వెల్లి గ్రామానికి వెళ్లి దర్శన, ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఎన్నికల సమయంలో కావడంతో లోతుగా దర్యాప్తు చేపడుతున్నామని, ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని బందో బస్తు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప రన్‌వెల్లి గ్రామానికి వెళ్లి సర్పంచ్‌ అభ్యర్థి దర్శన కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం పోలీసులు గ్రామంలో కవాతు నిర్వహించారు.

దళం పేరుతో వచ్చిన లేఖలో ఇలా..

ఎలక్షన్‌లో పోటీ చేసే వారు నామినేషన్‌ లోపే రెండు లక్షలు ఖర్చు చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు కోసం నోటు ఇచ్చి గెలవాలనుకుంటున్నారు. అందు కోసం మీకు హెచ్చరికగా ఉత్తరం రాస్తూ నామినేషన్‌ విత్‌డ్రా చేసుకోవాలని మా దళం హెచ్చరిక. నాకు ప్రజల ఆదరణ ఉందని, ప్రజలతో గాని పోలీసులను గాని సంప్రదిస్తే తదుపరి పరిణామాలు తీవ్ర స్థాయిలో ఉంటాయని రాశారు.

Updated Date - Dec 05 , 2025 | 10:43 PM