kumaram bheem asifabad- వేతన కష్టాలు తీరేనా..?
ABN , Publish Date - Sep 16 , 2025 | 11:18 PM
ప్రభుత్వం నుంచి రావాల్సిన జీతం నెల నెల రాక పోవడంతో జిల్లాలో పని చేస్తున్న 104 సిబ్బంది, ఎంసీహెచ్ సిబ్బందితో పాటు ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. ఆరు నెలలుగా వేతనాలు ప్రభుత్వం నుంచి చెల్లించక పోవడంతో ఆర్థికంగా అవస్థలు పడుతున్నారు. జిల్లాలో వైద్య విధాన పరిషత్ విభాగం పరిఽధిలో పని చేస్తున్న 104 సేవలు అందించేందుకు 20 మంది సిబ్బంది, ఎంసీహెచ్-3, ఔట్ సోర్సింగ్లో 60 మంది సిబ్బంది పని చేస్తున్నారు
- ఇబ్బందుల్లో 104, ఔట్ సోర్సింగ్ సిబ్బంది
కాగజ్నగర్, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం నుంచి రావాల్సిన జీతం నెల నెల రాక పోవడంతో జిల్లాలో పని చేస్తున్న 104 సిబ్బంది, ఎంసీహెచ్ సిబ్బందితో పాటు ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. ఆరు నెలలుగా వేతనాలు ప్రభుత్వం నుంచి చెల్లించక పోవడంతో ఆర్థికంగా అవస్థలు పడుతున్నారు. జిల్లాలో వైద్య విధాన పరిషత్ విభాగం పరిఽధిలో పని చేస్తున్న 104 సేవలు అందించేందుకు 20 మంది సిబ్బంది, ఎంసీహెచ్-3, ఔట్ సోర్సింగ్లో 60 మంది సిబ్బంది పని చేస్తున్నారు. 104 సిబ్బంది ప్రతీ నెల ప్రతి గ్రామంలో పర్యటించి సర్వేలు చేపట్టి గ్రామంలో వైద్య సేవలు ప్రాథమికంగా అందించే లక్ష్యంగా ఏర్పాటు చేసింది. ఆశయం బాగానే ఉన్నప్పటికీ వీరు సేవలు అందిస్తున్నప్పటికీ వీరికి వేతనం మాత్రం రావడం లేదు.
- నిత్యం పనుల్లో..
నిత్యం పనుల్లో ఉండే సిబ్బందికి నెలనెలా వేత నాలు రాకపోవడంతో కుటుంబాల పోషణకు అవస్థలు పడుతున్నారు. ఆరు నెలల నుంచి వీరికి జీతాలు రాక పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమకు నెల నెలా జీతాలు చెల్లించేలా చూడాలని అధికారులకు పలుమార్లు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ రావడం లేదని వాపోతున్నారు. అలాగే మదర్ కేర్ హెల్త్ విభాగంలో జిల్లాలో పని చేస్తున్న ముగ్గురు ఉద్యోగులకు కూడా గత ఆరు నెలల నుంచి జీతాలు రాలేదు. జిల్లాలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి కూడా ఇదే తరహాలో ఉండడంతో ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలు, కళాశాలలో చదువుతున్న పిల్లల కోసం ఫీజులు కట్టాల్సి ఉంటుందని, జీతాలు సక్రమంగా రాక పోవడంతో అవస్థల తప్పడం లేదని వాపోతున్నారు. వేతనాల కోసం ఆయా కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేస్తుంటే అధికారులు తాము బిల్లులు పంపించామని, ఈ-కుబేర్లో పెండింగ్లో ఉన్నట్టు చెబుతున్నారని పలువురు ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు.
- మున్సిపాలిటీలోనూ అదే పరిస్థితి..
కాగజ్నగర్ మున్సిపాలిటీలోనూ పని చేస్తున్న కాంట్రాక్టు పారిశుధ్య కార్మికుల 154 మంది ఉండగా, వీరి పరిస్థితి కూడా ఇదే తరహాలో ఉంది. వీరికి కూడా నాలుగు నెలలుగా వేతనాలు అందడం లేదు. వారం రోజుల క్రితం ఎమ్మెలీస దండే విఠల్ను కలిసి వినతి పత్రం అందజేశారు. వేతనాల సమస్యను పరిష్కారించాలని కాంట్రాక్టు కార్మికులంతా కూ డా తమ గోడను ఎమ్మెల్సీకి వివరించారు. వీరితో పాటు గ్రామ పంచా యతీలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులు సైం నెల నెల జీతాలు రాక తంటాలు పడుతున్నారు. ఉన్నతాధి కారులు స్పందించి వేతనాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.