kumaram bheem asifabad- బస్ డిపో ఏర్పాటయ్యేనా..?
ABN , Publish Date - Oct 25 , 2025 | 10:27 PM
కాగజ్నగర్లో బస్ డిపో ఏర్పాటుకు ముందడుగు పడడం లేదు. జనాభాకు తగ్గట్టుగా రవాణా సౌకర్యాలు లేకపోవడంతో ప్రయాణికులకు దశాబ్దాలుగా ఇబ్బందులు తప్పడం లేదు. కాగజ్నగర్లో బస్ డిపోకు 30 సంవత్సరాల క్రితమే భూమి కేటాయిం చారు. కానీ నిర్మాణానికి అడుగులు పడడం లేదు. దీంతో బస్ డిపోకు కేటాయిచిన ఆ భూములు అన్యాక్రాంతం అవుతున్నా పట్టించుకునే వారు లేకుండా పోయారు.
- ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
కాగజ్నగర్ టౌన్, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): కాగజ్నగర్లో బస్ డిపో ఏర్పాటుకు ముందడుగు పడడం లేదు. జనాభాకు తగ్గట్టుగా రవాణా సౌకర్యాలు లేకపోవడంతో ప్రయాణికులకు దశాబ్దాలుగా ఇబ్బందులు తప్పడం లేదు. కాగజ్నగర్లో బస్ డిపోకు 30 సంవత్సరాల క్రితమే భూమి కేటాయిం చారు. కానీ నిర్మాణానికి అడుగులు పడడం లేదు. దీంతో బస్ డిపోకు కేటాయిచిన ఆ భూములు అన్యాక్రాంతం అవుతున్నా పట్టించుకునే వారు లేకుండా పోయారు. కాగజ్నగర్లో బస్ డిపో కోసం గతంలోనే బస్సు స్టేషన్ పక్కన స్థలం కేటాయించారు. కానీ నేటికి కూడా బస్ డిపో ఏర్పాటు కోసం నిధులు కానీ కార్యాచరణ కానీ ముందుకు సాగడం లేదు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు, గ్రామాలకు నేటికి కూడా బస్ సౌకర్యం లేకపోవడంతో ఆశించిన అభివృద్ధి జరగడం లేదు. ఇంకా ఆర్టీసీ బస్సు సేవలు లేని గ్రామాలు జిల్లాలో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. జిల్లా వ్యాప్తంగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో బస్ డిపో ఉన్నప్పటికీ కాగజ్నగర్ డివి జన్లో ఉన్న ఏడు మండలాలైన సిర్పూర్(టి). బెజ్జూరు, కౌటాల, చింతలమానెపల్లి, దహెగాం, పెంచికల్పేటతో పాటు కాగజ్నగర్ మండలాల్లోని అనేక మారుమూల ప్రాంతాలకు నేటికి బస్సు సౌకర్యం లేదు. వీటిలో అటవీ గిరిజన గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ఆర్టీసి బస్సు సౌకర్యం కాదుకదా కనీసం బస్సు షెల్టర్స్, బస్సు స్టేషన్ల నిర్మాణం కూడా కొన్ని మండల కేంద్రాల్లో జరగలేదు. దశాబ్దాలుగా ఒక్క కౌటాల మినహా సిర్పూర్ (టి), బెజ్జూరు, దహెగాంలతో పాటు కొత్త మండలాల్లో బస్సు స్టేష న్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ ఉంది. కానీ గత ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణలు న్నాయి. ఇందుకు గత పాలకుల నిర్లక్ష్యమే కారణమని భావిస్తున్నారు. గత మూడు నెలల క్రితం సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు కూడా అసెంబ్లీలో కాగజ్నగర్కు బస్ డిపో ఏర్పాటు చేయాలని, దీంతో సిర్పూరు నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల కు రవాణా వ్యవస్థ మరింత మెరుగు పరిచేందుకు అవకాశాలున్నాయని ప్రస్తావించారు. దీంతో కాగజ్నగర్ డిపో తెరమీదకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా బస్ డిపో కోసం అడుగులు వేస్తుండ డంపై కొత్తగా ఆశలు చిగురిస్తున్నాయి.
- ఏడు మండలాలకు..
కాగజ్నగర్లో డిపో ఏర్పాటు చేస్తే సిర్పూరు నియోజకవర్గంలోని కాగజ్నగర్, సిర్పూరు(టి), బె జ్జూరు, కౌటాల, చింతలమానేపల్లి, దహెగాం, పెంచిక లపేట మండలాలకు చెందిన గ్రామీణ ప్రాంతాలకు రవాణా వ్యవస్థ ఉంది. ఈ మండలాల్లో గిరి గ్రామాలున్నాయి. నిత్యం వివిధ అవసరాల కోసం కాగజ్నగర్కు వస్తుంటారు. బస్సులు సకాలంలో రాక పోవడంతో వీరంతా ఆటోలు, జీపుల్లో ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాగజ్నగర్ డిపో ఏర్పాటు చేస్తే ఈ గ్రామాలకు నేరుగా బస్సులను పంపించేందుకు అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఆసిఫాబాద్ డిపో నుంచి కాగజ్నగర్ బస్టాండుకు బస్సులు రావాల్సి ఉంటుంది. కాగజ్నగర్కు వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి బస్సులను వివిధ రూట్లలో ఆయా గ్రామాలకు పంపించాల్సిన పరిస్థితి ఉంది. కాగజ్నగర్ బస్ డిపో ఏర్పాటు చేస్తే అన్ని మండ లాలకు బస్సు సౌకర్యం కల్పించే అవకాశం ఉంటుంది. జిల్లా సరిహద్దున ఉన్న మహారాష్ట్ర్ట్రకు కూడా సిర్పూరు(టి), చింతల మానెపల్లి. కౌటాల, బెజ్జూరు మండలాల మీదుగా బస్సులు రాకపోకలు సాగించే అవకాశం ఉంటుంది. బస్ డిపో స్థలం ఆక్రమణకు గురవుతుం డడంతో గతంలో అధికారులు సర్వే చేపట్టారు. రెవెన్యూ అధికారులను కూడా సంప్రదించి హద్దులు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కొంతమేర కబ్జాకు గురువుతుందనే ఆరోపణలున్నాయి. కాగజ్నగర్ నుంచి ఆయా మండలాలకు వార సంతలకు వెళ్లే వ్యాపారులు బస్సు సౌకర్య కల్పిస్తే బాగుంటుందని భావిస్తున్నారు. దీంతో మరింత ఆర్టీసికి ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. అధికా రులు కాగజ్నగర్లో బస్ డిపోతో పాటు బస్సు షెల్టర్ల నిర్మాణం, ఆయా మండలాల్లో బస్సు స్టేషన్లు ఏర్పాటు చేయాలని ఏడు మండలాల ప్రజలు కోరుతున్నారు.
అధికారులు చర్యలు తీసుకోవాలి
- సూర్యప్రకాష్, కాగజ్నగర్
కాగజ్నగర్లో ఆర్టీసి బస్ డిపో ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవాలి. బస్ డిపో ఏర్పాటు చేస్తే సిర్పూరు నియోజకవర్గంలోని ఏడు మండలాల వాసులకు ఎంత గానో సౌకర్యం ఉంటుంది. జిల్లా సరిహద్దుల్లోని గ్రామాల ప్రజలకు మహారాష్ట్రకు రాకపోకలకు సాగించేందుకు ఇబ్బందులు తొలగిపో తాయి. ఆర్టీసీకి ఆదా కూడా పెరుగనుంది. అధికారులు చర్యలు తీసుకోవాలి.