Domestic Crime: మద్యంలో బీపీ, నిద్రమాత్రలు కలిపి..స్పృహ కోల్పోయాక చీరతో ఉరి వేసి..
ABN , Publish Date - Oct 17 , 2025 | 02:01 AM
తనకు వివాహేతర సంబంధం ఉండడంతో పాటు డబ్బుల కోసం వేధిస్తున్నాడని ఓ భర్తను భార్య మద్యంలో బీపీ, నిద్రమాత్రలు కలిపి తాగించి..
డబ్బుల కోసం వేధిస్తున్నాడని భర్తను హత్య చేసిన భార్య.. సహజ మరణంగా అత్తమామలను నమ్మించిన వైనం
మొదట కూరలో వయాగ్రా మాత్రలు కలిపి చంపే యత్నం
ఆమెతో పాటు సహకరించిన ఐదుగురి అరెస్టు
కరీంనగర్ క్రైం, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): తనకు వివాహేతర సంబంధం ఉండడంతో పాటు డబ్బుల కోసం వేధిస్తున్నాడని ఓ భర్తను భార్య మద్యంలో బీపీ, నిద్రమాత్రలు కలిపి తాగించి.. అతను స్పృహ కోల్పోయిన తర్వాత చీరతో ఉరి వేసి హత్య చేసింది. సెప్టెంబరు 17న జరిగిన ఈ ఘటనపై పోలీసులు మొదట అనుమానాస్పద స్థితిలో మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత అందిన సమాచారంతో లోతుగా విచారణ చేయగా భార్యే పథకం ప్రకారం భర్తను హత్య చేసినట్లు తేలింది. పోలీసులు ఆ మహిళతో పాటు ఆమెకు సహకరించిన ఐదుగురిని అరెస్టు చేశారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం గురువారం కేసు వివరాలను వెల్లడించారు. స్థానిక సప్తగిరి కాలనీకి చెందిన కత్తి సురేష్ (36) ప్రైవేట్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సెప్టెంబరు 17న రాత్రి సురేష్ లైంగిక చర్య సమయంలో స్పృహ కోల్పోయాడని అతని భార్య మౌనిక తన అత్తమామలకు ఫోన్ చేసి చెప్పింది. వారు అతనిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడని వైద్యులు తెలిపారు. ఇన్సూరెన్స్ల కోసం కేసు నమోదు చేయించాలని కొందరు మౌనికకు సలహా ఇవ్వడంతో కరీంనగర్ టూ టౌన్ పోలీసులు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఆమె వ్యవహారంపై అనుమానం వచ్చిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు లోతుగా విచారించగా సురే్షది హత్యగా నిర్ధారణ అయింది. 2015లో ప్రేమ వివాహం చేసుకున్న సురేష్, మౌనికకు ఇద్దరు పిల్లలున్నారు. 9నెలల కిందట ఆమె సెక్స్వర్కర్ వృత్తిలోకి ప్రవేశించింది. ఈ క్రమంలో ఆమెకు దొమ్మాటి అజయ్తో పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధంగా మారింది. సురేష్ తరచుగా డబ్బులు కావాలని మౌనికను వేధిస్తుండడంతో అతన్ని అంతమొందించాలని నిర్ణయించుకుని తన బంధువు అయిన మరో సెక్స్వర్కర్ అరిగె శ్రీజకు విషయం చెప్పింది. ఆమె మెడికల్ ఏజెన్సీ యజమాని పోతు శివకృష్ణ, మరో సెక్స్వర్కర్ వేముల రాధ అలియాస్ నల్ల సంధ్య ను మౌనికకు పరిచయం చేసింది. వీరంతా కలిసి సురే్షను హత్య చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. వయాగ్రా, బీపీ మాత్రలతో సురే్షను చంపవచ్చని శివకృష్ణ వారికి సూచించాడు. మొదటి ప్రయత్నంలో నల్ల సంధ్య.. నల్ల దేవదాసు ద్వారా 15 వయాగ్రా మాత్రలను తెప్పించి మౌనికకు ఇవ్వగా ఆమె.. కూరలో కలిపి సురేష్ కు పెట్టింది. కూర వాసన వచ్చి అతను తినలేదు. మౌనిక రెండో యత్నంలో సెప్టెంబరు 17న రాత్రి శివకృష్ణ సలహాతో బీపీ, నిద్రమాత్రలను చూర్ణం చేసి మద్యంలో కలిపి సురేష్కు ఇచ్చింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోగానే ఇంట్లోని చీరను ఒకపక్క కిటికీ గ్రిల్కు కట్టి.. మరోపక్క సురేష్ మెడకు బిగించి ఉరేసి చంపింది. మౌనికతో పాటు ఆమెకు సహకరించిన నిందితులు శ్రీజ, శివకృష్ణ, అజయ్, నల్ల సంధ్య అలియాస్ వేముల రాధ, దేవదాసును పోలీసులు గురువారం అరెస్టు చేశారు.