బస్ షెల్టర్లను పట్టించుకునేవారేరీ?
ABN , Publish Date - Jul 02 , 2025 | 12:16 AM
రాజాపేట మండలంలోని బసంతాపూర్, పొట్టిమర్రి గ్రామాల్లోని బస్షెల్టర్ల నిర్మాణాలు నత్తలకే నడకను నేర్పుతున్నాయి. దశాబ్దాలు గడుస్తున్నా నిర్మాణాలు మాత్రం పూర్తికావడం లేదు. ఎప్పుడు పూర్తయ్యేనో నని గ్రామస్థలు ఎదురుచూస్తున్నారు.
రాజాపేట, జూలై 1(ఆంధ్రజ్యోతి): రాజాపేట మండలంలోని బసంతాపూర్, పొట్టిమర్రి గ్రామాల్లోని బస్షెల్టర్ల నిర్మాణాలు నత్తలకే నడకను నేర్పుతున్నాయి. దశాబ్దాలు గడుస్తున్నా నిర్మాణాలు మాత్రం పూర్తికావడం లేదు. ఎప్పుడు పూర్తయ్యేనో నని గ్రామస్థలు ఎదురుచూస్తున్నారు. అప్పటి ఉమ్మడి నల్లగొండ ఎంపి సురవరం సుధాకర్రెడ్డి హయాంలో బస్ షెల్టర్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేశారు. బసంతాపూర్, పొట్టిమర్రి, కాల్వపల్లి గ్రామాలలో నిర్మించేందుకు ఒక్కో బస్షెల్టర్కు 2లక్షలు మంజూరు చేశారు. కాల్వపల్లి బస్షెల్టర్ నిర్మాణం పూర్తి కాగా మిగతా రెండు నిర్మాణాలు అర్ధాంతరంగానే నిలిచిపోయాయి. కంప చెట్లతో నిండిపోయి వెక్కిరిస్తున్నాయి. అధికారులు, నాయకులకు కళ్ళ ముందు కనిపిస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. ఇప్పటికైనా బస్షెల్టర్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
బస్షెల్టర్ నిర్మాణాలు పూర్తి చేయాలి
ప్రయాణికుల అవసరాల కోసం నిర్మిస్తున్న బస్షెల్టర్ల నిర్మాణం ఏళ్ళు గడుస్తున్నా పూర్తి కావడం లేదు. రెండు దశాబ్ధాలు గడుస్తుంది..ఇప్పటికైనా నిధులు మంజూరు చేసి ప్రయాణికుల కష్టాలు తీర్చాలి.
-మెండు భగవానరెడ్డి, బసంతాపూర్