kumaram bheem asifabad- వామ్మో చలి
ABN , Publish Date - Nov 19 , 2025 | 10:49 PM
కుమ రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చలి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు ఒక్క సారిగా పడి పోవడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. బుధవారం జిల్లా లోని తిర్యాణి మండలంలోని గిన్నెధరి గ్రామంలో రాష్ట్రంలోనే అత్యల్పంగా 7.9 డిగ్రీల ఉష్ణోగ్రతకు పడిపోయాయి. దీనికి తోడు గ్రామాల్లో పొగమంచు కమ్మెస్తోంది. చలికి ఏజెన్సీ మండలాలు గజగజ వణికిపోతున్నాయి.
- గిన్నెధరిలో అత్యల్పంగా 7.9 డిగ్రీలు
- నెగళ్లతో ఉపశమనం పొందుతున్న ప్రజలు
- వృద్ధులు, చిన్నారుల తీవ్ర అవస్థలు
ఆసిఫాబాద్, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): కుమ రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చలి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు ఒక్క సారిగా పడి పోవడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. బుధవారం జిల్లా లోని తిర్యాణి మండలంలోని గిన్నెధరి గ్రామంలో రాష్ట్రంలోనే అత్యల్పంగా 7.9 డిగ్రీల ఉష్ణోగ్రతకు పడిపోయాయి. దీనికి తోడు గ్రామాల్లో పొగమంచు కమ్మెస్తోంది. చలికి ఏజెన్సీ మండలాలు గజగజ వణికిపోతున్నాయి. చిన్నారులు, వృద్ధులు చలి నుంచి రక్షణ పొందేందుకు నానా తంటాలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. సాయంత్రం ఐదు గంటలు దాటితే జనాలు బయటికి వెళ్లనంత చలి తీవ్రత పెరగడంతో ఆసిఫాబాద్ ప్రాంతంలో జనజీవనం స్తంభిస్తోంది. ముఖ్యంగా అడవులు అధికంగా ఉన్న మండలాలైన తిర్యాణి, కెరమెరి, జైనూర్, సిర్పూర్(యు), లింగాపూర్, బెజ్జూరు, చింతలమానెపల్లి, పెంచికలపేట, దహెగాం, కౌటాల, సిర్పూర్(టి), ఆసిఫాబాద్ ప్రాం తాల ప్రజలు చలి నుంచి రక్షణ పొందేందుకు షటర్లు, జర్కీన్లు ధరిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు చీకటైతే చాలు ఇళ్ల ముందు నెగళ్లు ఏర్పాటు చేసుకుని కాలం వెళ్లదీస్తున్నారు. చలితీవ్రత గతంలో ఎప్పుడు లేనంతగా కనిపిస్తుండడంతో రానున్న రోజుల్లో ఈ తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందోనన్న ఆందోళన జిల్లా వాసుల్లో వ్యక్తమవుతోంది. నిజానికి ఆసిఫాబాద్ ప్రాంతంలో చలి తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. కానీ ఈ సారి సీజన్ లో కూడా చలి పంజా విసురుతుండడంతో జిల్లా కేంద్రంతో పాటు కాగజ్నగర్ డివిజన్ కేంద్రం చీకటి పడితే చాలు జనాలు లేక బోసిపోతోంది. ఉదయం 9 గంటలు దాటితే కానీ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. తెల్లవారు లేవగానే పొలం పనులకు వెళ్లె రైతులు, పాలు పోసే వ్యాపారులు, పేపర్ బాయ్స్, వాకర్స్ చలి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చలి తీవ్రత ఒక్కసారిగా పెరగడంతో వైద్యులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వృద్ధులు, చిన్నారులు రక్షణ లేకుండా చలిలో బయటకు వెళ్లితే శ్వాస కోస సంబంధిత ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
- ఏజెన్సీ మండలాల్లో ఇబ్బందులు..
జిల్లాలోని ఏజెన్సీ మండలాల్లో చలి తీవ్రతకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తిర్యాణి మండలం గిన్నెధరిలో అత్యల్పంగా 7.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమో దైంది. రాష్ట్రంలోనే అత్యల్పంగా గిన్నెధరిలో నమో దైంది. జిల్లా వ్యాప్తంగా ఏజెన్సీ మండలాలు చలికి వణికి పోతున్నాయి. కెరమెరిలో 8.8, సిర్పూర్(యూ) లో 10.3, వాంకిడిలో 11.1 డిగ్రీలు అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రత పెరగడంతో ఆసిఫాబాద్, కాగజ్నగర్ పట్టణాలతో పాటు ఆయా మండల కేంద్రాల్లో షెటర్లు, జర్కీన్లకు గిరాకీ పెరిగింది. ఒక్క సారిగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలితీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు శరీరక్షణ కోసం షెటర్లు, జర్కీన్లు, మఫ్లర్లు, చేతి తొడుగులు తదితరాల కొనుగోలు చేపడుతున్నారు. దీంతో ఒక్క సారిగా ఉన్ని దుస్తుల గిరాకీ పెరిగింది.
- ఐదు రోజులుగా నమోదైన ఉష్ణోగ్రతలు..
జిల్లాలో ఐదు రోజులుగా నమోదైన గరిష్ఠ , కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. ఈ నెల15వ తేదీన 31.6 గరిష్ఠ కాగా 8.4 కనిష్ఠగా నమోదు అయింది. 16న 32.4 గరిష్ఠం, 7.4 కనిష్ఠం ఉష్ణోగ్రత నమోదైంది. 17న 29.8 గరిష్ఠ, 7.0 కనిష్టం, 18న 31.0 గరిష్ఠం, 6.8 కనిష్ఠం, 19న 32.1 గరిష్ఠం, 7.9 డిగ్రీలు కనిష్ఠ ఉష్టోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో చలి విజృంభిస్తున్నది. ఉష్ణోగ్రతలు, ఒక్కసారిగా పడిపోవడంతో జిల్లా ప్రజలు చలికి వణికిపోతున్నారు. పగలంతా వేడిమి ఉంటున్నా సాయంత్రం ఐదు గంటలు దాటితే చలి తీవ్రత పెరిగిపోవడంతో ఏజెన్సీ గ్రామాల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.