kumaram bheem asifabad- సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేయాలి
ABN , Publish Date - Oct 24 , 2025 | 10:15 PM
జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమం దృష్ట్యా జిల్లాలో చేపట్టిన ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేసేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని అదనపు కలెక్టర్, జిల్లా ఇన్చార్జి డీఈవో దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలోని వీసీ హాల్ నుంచి జిల్లా పరిషత్ సీఈవో లక్ష్మీనారాయణ, జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతిగౌడ్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారావు, జిల్లా సంక్షేమాధికారి భాస్కర్, ఇతర అధికారులతో కలిసి శుక్రవారం ఎంపీడీవో ఎంపీవో, ఎంఈవో, సహాయ ప్రాజెక్టు అధికారులు, సహాయ ప్రోగ్రాం మేనేజర్లు, పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీరాజ్, గృహ నిర్మాణ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో జూమ్ మీటింగ్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఆసిఫాబాద్రూరల్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమం దృష్ట్యా జిల్లాలో చేపట్టిన ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేసేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని అదనపు కలెక్టర్, జిల్లా ఇన్చార్జి డీఈవో దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలోని వీసీ హాల్ నుంచి జిల్లా పరిషత్ సీఈవో లక్ష్మీనారాయణ, జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతిగౌడ్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారావు, జిల్లా సంక్షేమాధికారి భాస్కర్, ఇతర అధికారులతో కలిసి శుక్రవారం ఎంపీడీవో ఎంపీవో, ఎంఈవో, సహాయ ప్రాజెక్టు అధికారులు, సహాయ ప్రోగ్రాం మేనేజర్లు, పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీరాజ్, గృహ నిర్మాణ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో జూమ్ మీటింగ్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. సదరం యూడీఐడీ, ఇందిరమ్మ ఇళ్లు, ఉపాధి, ఉపాధి హామీ పథకం పనులు, పేరెంట్స్ కమిటీ సమావేశాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాల భవనాలు, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణ పనులు ఇతర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అధికారులు సమన్వయంతో సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు. సదరం శిబిరాల ద్వారా అర్హత కలిగిన దివ్యాంగులకు యూడీఐడీ గుర్తింపు కార్డులు జారీ చేయాలని చెప్పారు. నిరుపేదల కోసం ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునే విధంగా అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. త్వరగా ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేసుకునే విధంగా అధికారులు పర్యవేక్షించాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద ప్రభుత్వం చేపట్టిన మౌలిక సదుపాయాల పనులు వేగవంతం చేయాలన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాలు, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. పాఠశాలల్లో నిర్వహించే సమావేశాల్లో తల్లిదండ్రులను భాగస్వాములను చేస్తూ విద్యార్థులు చదువులో రాణించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
విద్యాలయాన్ని సందర్శించి.. సూచనలు చేసి..
వాంకిడి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని అదనపు కలెక్టర్, ఇన్చార్జి జిల్లా విద్యాధికారి దీపక్ తివారి శుక్రవారం సందర్శించి సిబ్బందికి సూచనలు చేశారు. ఈ సందర్భంగా వంట గది, మధ్యాహ్న భోజనం నాణ్యత, తరగతి గదులు, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా ఉపాధ్యాయులు పర్యవేక్షించాలని చెప్పారు. విద్యార్థుల గైర్హాజరకు గల కారణాలను వారి తల్లిదండ్రులను అడిగి తెలుసుకోవాలని తెలిపారు. పాఠశాల రికార్డులు, రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. విద్యార్థినులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించలని తెలిపారు. ప్రధాన మంత్రి శ్రీ పథకం కింద పాఠశాలలో చేపట్టిన పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని, పనుల నిర్వహణలో నాణ్యత ప్రమాణాలను పాటించాలని తెలిపారు. విద్యార్థినులతో మాట్లాడుతూ పాఠశాలలో కల్పిస్తున్న సౌకర్యాలు, విద్యాభ్యాసం, మధ్యాహ్న భోజనం నాణ్యత, ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు పథకాలను విద్యార్థినులు సక్రమంగా వినియోగించుకోవాలని, చదువుపై శ్రద్ద వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.