NHRC Chief: డబ్బు తీసుకొని ఓట్లేసే ప్రజలే..ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకారులు
ABN , Publish Date - Dec 20 , 2025 | 04:55 AM
భారతదేశంలో ప్రజలు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకున్న నాయకుల నియంత పాలన కోరుకుంటున్నారని, డబ్బు తీసుకొని ఓట్లేసే ప్రజలే ప్రజాస్వామ్యానికి అత్యంత...
నేటి ప్రజలు నియంత పాలన కోరుకుంటున్నారు:ఎన్హెచ్ఆర్సీ చైర్మన్
దేశం వరకు వస్తే అందరం ఒక్కటే: దుద్దిళ్ల
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): భారతదేశంలో ప్రజలు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకున్న నాయకుల నియంత పాలన కోరుకుంటున్నారని, డబ్బు తీసుకొని ఓట్లేసే ప్రజలే ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకారులని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) చైర్మన్ జస్టిస్ వి. రామసుబ్రమణియన్ అన్నారు. శుక్రవారం జూబ్లీహిల్స్ కల్చరల్ సెంటర్లో మాజీ సీపీఆర్వో వనం జ్వాలా నరసింహారావు రచించిన ‘డెమోక్రసీ అండ్ గవర్నెన్స్ త్రూ లెన్స్ అండ్ బ్లర్డ్ గ్లాస్’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. మనదేశంలో 60 ఏళ్ల క్రితం ఓటు వేయడానికి డబ్బు తీసుకోవడం పాపంగా భావించేవారని, తర్వాతి 30 ఏళ్లకు ఓటు వేసేందుకు డబ్బు తీసుకోవడానికి సిగ్గుపడేవారని, నేడు ఓటు వేసేందుకు డబ్బు తీసుకోవడం తమ హక్కుగా భావించే స్థాయికి చేరారని ఆందోళన వ్యక్తం చేశారు. డబ్బు తీసుకొని ఓటేసే వారిని శిక్షించేందుకు చట్టాలు లేవని ఆయన అన్నారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మాట్లాడుతూ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను ఎవరి దృష్టికోణంలో వారు చూసి ఒకరి భావాలను ఒకరు అంగీకరించరన్నారు. రాజకీయంగా, భావజాల పరంగా ఎన్ని తేడాలు ఉన్నా.. దేశం గురించి అంటే అందరం కలిసి ఒకటిగా పనిచేస్తామన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తదితరులు పాల్గొన్నారు.