Vivek and Harish Clash: వివేక్, హరీశ్ మధ్య మాటల యుద్ధం
ABN , Publish Date - Oct 23 , 2025 | 06:20 AM
ఆరు గ్యారంటీలు, ఎన్నికల హామీలపై మంత్రి గడ్డం వివేక్, మాజీ మంత్రి హరీశ్రావు మధ్య మాటల యుద్ధం జరిగింది. సిద్దిపేట కలెక్టరేట్లో బుధవారం...
కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఎప్పుడిస్తారని ప్రశ్నించిన హరీశ్రావు
హామీలన్నీ అమలు చేస్తున్నామన్న వివేక్
గత ప్రభుత్వ అప్పులే చెల్లిస్తున్నామని వెల్లడి
సిద్దిపేట అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): ఆరు గ్యారంటీలు, ఎన్నికల హామీలపై మంత్రి గడ్డం వివేక్, మాజీ మంత్రి హరీశ్రావు మధ్య మాటల యుద్ధం జరిగింది. సిద్దిపేట కలెక్టరేట్లో బుధవారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేసే కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ.2,500, కల్యాణలక్ష్మి పథకం కింద తులం బంగారం ఎప్పుడిస్తారో ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. మూసీ సుందరీకరణ, ఫ్యూచర్సిటీ కోసం లక్షల కోట్లు వెచ్చిస్తామని చెబుతున్న ప్రభుత్వం.. ఆరు గ్యారంటీల అమలుకు డబ్బుల్లేవని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. దీనిపై మంత్రి వివేక్ స్పందిస్తూ.. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం అవసరమైన చోట డబ్బులు ఖర్చు పెట్టకుండా.. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుకే లక్ష కోట్లు వెచ్చించిందని గుర్తు చేశారు. కేసీఆర్ హయాంలో చేసిన అప్పులను తాము చెల్లిస్తున్నామని గుర్తు చేశారు. కాగా, సమావేశంలో మంత్రి వివేక్ మాట్లాడుతూ సన్నబియ్యం ఇస్తున్నారా అని అడగ్గా.. ఇవ్వడం లేదని మహిళలు చెప్పారు. ఈ విషయమై దృష్టి సారించాలని కలెక్టర్ హైమావతికి మంత్రి సూచించారు.