అప్పుల బాధతో ఇద్దరు అన్నదాతల ఆత్మహత్య
ABN , Publish Date - Jun 23 , 2025 | 05:06 AM
వ్యవసాయం కలిసిరాక, అప్పులు తీర్చే మార్గం కనిపించక ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
జనగామ రూరల్, కమలాపూర్, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయం కలిసిరాక, అప్పులు తీర్చే మార్గం కనిపించక ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. జనగామ జిల్లా జనగామ మండలం శామీర్పేటలో చాపల భాస్కర్(40), స్రవంతి దంపతులు తమకున్న రెండెకరాలు సాగు చేసుకుంటూ, టీస్టాల్ నడుపుతూ జీవిస్తున్నారు. తన ఇద్దరు కుమార్తెల వివాహం కోసం భాస్కర్ రూ.6 లక్షల వరకు అప్పులు చేశాడు.
వ్యవసాయం కలిసి రాకపోవడం, అప్పులు పెరిగిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన భాస్కర్ ఆదివారం చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే, హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గూడూరుకు చెందిన కుమ్మరి ప్రతాప్(35) పంటలు సరిగ్గా పండక, అప్పులు పెరిగిపోయి ఈ నెల 21న గడ్డి మందు తాగాడు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడు.