Gariaband encounter in Chhattisgarh: గరియాబంద్ ఎన్కౌంటర్ మృతుల గుర్తింపు
ABN , Publish Date - Sep 13 , 2025 | 04:17 AM
ఛత్తీ్సగఢ్లోని గరియా బంద్ జిల్లాలో గురువారం ఎన్కౌంటర్ జరిగి 10 మంది మావోయిస్టులు మృతి చెందగా.. మృతదేహాలను శుక్రవారం గరియాబంద్..
మృతుల్లో ముగ్గురు తెలుగువారు
బీజాపూర్లో మరో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టుల మృతి
చర్ల, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఛత్తీ్సగఢ్లోని గరియాబంద్ జిల్లాలో గురువారం ఎన్కౌంటర్ జరిగి 10 మంది మావోయిస్టులు మృతి చెందగా.. మృతదేహాలను శుక్రవారం గరియాబంద్ జిల్లా కేంద్రానికి తరలించారు. మృతదేహాలను గుర్తించగా.. వారిలో ముగ్గురు తెలుగువాళ్లు ఉన్నారు. మృతి చెందిన 10 మంది మీద సుమారు కోటి 60లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. చనిపోయిన వారిలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మోడెం బాలకృష్ణ అలియాస్ మనోజ్ (రూ.కోటి రివార్డు), ప్రమోద్ అలియాస్ పాండు (ఒరిసా రాష్ట్ర కమిటీ సభ్యుడు, 25లక్షల రివార్డు), విమల్ అలియాస్ మంగన్న (టెక్నికల్ టీం ఇన్చార్జి, 8 లక్షల రివార్డు), విక్రమ్ (ఏరియా కమిటీ మెంబర్, 5లక్షల రివార్డు) ఉమేష్ (డిప్యూటీ కమాండర్, 5 లక్షల రివార్డు), రజిత (ఏరియా కమిటీ మెంబర్, 5 లక్షల రివార్డు), అంజలి (ఏరియా కమిటీ మెంబర్, 5లక్షల రివార్డు), సింధూ (ఏరియా కమిటీ మెంబర్, 5లక్షల రివార్డు) ఆర్తి (గార్డు, లక్ష రివార్డు), సమీర్ (మెంబర్, లక్ష రివార్డు) ఉన్నారు. వీరిలో బాలకృష్ణది వరంగల్ కాగా.. విమల్ది ఆదిలాబాద్ అని, ప్రమోద్ది ఆంధ్రప్రదేశ్ అని గరియాబంద్ జిల్లా పోలీసులు తెలిపారు. కాగా.. మృతదేహాల వద్ద నుంచి రెండు ఏకే 47, ఎస్ఎల్ఆర్, 303 తుపాకులను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. శనివారం ఉదయం కూడా గరియాబంద్ జిల్లా అడవుల్లో మళ్లీ ఎదురు కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. అలాగే ఛత్తీ్సగఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా గంగలూరు అడవుల్లో శుక్రవారం ఉదయం పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.