Share News

ట్యాంక్‌ నిర్మించారు.. కనెక్షన మరిచారు!

ABN , Publish Date - Jul 07 , 2025 | 12:29 AM

పెద్దఅడిశర్లపల్లి మండలంలోని అంగడిపేట ఎక్స్‌రోడ్డు వద్ద నీటి సమస్యను పరిష్కరించేందుకు గత ప్రభుత్వం 90వేల లీటర్ల సామర్థ్యంతో మిషన భగీరథ ట్యాంక్‌ నిర్మించింది. కానీ దానికి కనెక్షన ఇవ్వకపోవడంతో కాలనీవాసులు నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

 ట్యాంక్‌ నిర్మించారు.. కనెక్షన మరిచారు!
రైతు వేదిక వద్ద వృథాగా ఉన్న మిషన భగీరథ ట్యాంకు

ట్యాంక్‌ నిర్మించారు.. కనెక్షన మరిచారు!

నిర్వహణపై వాటర్‌ గ్రిడ్‌, జీపీ అధికారుల్లో సందిగ్ధత

కనెక్షన ఇవ్వని అధికారులు

పెద్దఅడిశర్లపల్లి, జూలై 6 (ఆంధ్రజ్యోతి): పెద్దఅడిశర్లపల్లి మండలంలోని అంగడిపేట ఎక్స్‌రోడ్డు వద్ద నీటి సమస్యను పరిష్కరించేందుకు గత ప్రభుత్వం 90వేల లీటర్ల సామర్థ్యంతో మిషన భగీరథ ట్యాంక్‌ నిర్మించింది. కానీ దానికి కనెక్షన ఇవ్వకపోవడంతో కాలనీవాసులు నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలోని సుమారు 200 ఇళ్లల్లో నీటి సమస్యలను పరిష్కరించేందుకు ఈ ట్యాంకును నిర్మించారు. మిషన భగీరథ అధికారులు నేరుగా మెయినపైపు నుంచి ట్యాంక్‌కు కనెక్షన ఇస్తే ఇతర గ్రామాలకు నీటి సమస్య ఎదురవుతుందని పేర్కొంటున్నారు. ట్యాంక్‌కు 100 మీటర్ల దూరంలో ఉన్న 2లక్షల లీటర్ల సామర్థ్యం ఉన్న ఉన్న సంపులోకి కనెక్షన ఇస్తామని, అక్కడి నుంచి మోటార్‌ ద్వారా ట్యాంకుకు నీళ్లు సరఫరా చేయాలని ప్రతిపాదన చేశారు. కానీ కాంట్రాక్టర్‌, ప్రజాప్రతినిధులు మాత్రం నేరుగా ట్యాంక్‌కు కనెక్షన ఇవ్వాలని కోరుతున్నారు. ఒకవేళ సంపు నుంచి మోటార్‌ ద్వారా పంపిణీ చేసినా విద్యుత చార్జీలు, నిర్వహణ ఎవరు చేస్తారని మరో వాదన వినిపిస్తున్నారు. వాటర్‌ గ్రిడ్‌ ద్వారా అయితే వారే విద్యుత చార్జీలు చెల్లిస్తారు. ఒకవేళ ఇంటర్నల్‌ మిషన భగీరథ వారు అయితే గ్రామ పంచాయతీ ద్వారా నిర్వహణ చేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే అసలే గ్రామ పంచాయతీలలో నిధులు లేవని కొత్తగా ఇది ఎక్కడ నిర్వహణ చర్యలు చేపట్టాలని జీపీ అఽధికారులు పేర్కొంటున్నారు. కాంట్రాక్టర్‌, మిషన భగీరథ అధికారుల సమన్వయలోపంతో ఎత్తులో ట్యాంకు నిర్మించారని పలువురు విమర్శిస్తున్నారు. ట్యాంకు ఏర్పాటు చేసి రెండేళ్లుగా వృథాగా ఉంచారని ప్రజలు ఆరోపిస్తున్నారు. దీంతో కాలనీవాసులు నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వం ఓట్ల కోసమే ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా ట్యాంకు నిర్మించి కనెక్షన ఇవ్వకుండా కాలయాపన చేసిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా మిషన భగీరథ గ్రిడ్‌ అధికారులు స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు కోరుతున్నారు.

సమస్య పరిష్కరించేందుకు కృషి

సమస్య పరిష్కరించేందకు కృషి చేస్తాం. ట్యాంకుకు మెయిన పైపు నుంచి నేరుగా కనెక్షన ఇస్తే ఇతర గ్రామాలకు మిషన భగీరథ నీళ్లు అందవు. దీంతో నీటి సమస్యలు ఏర్పడుతాయి. ట్యాంక్‌కు 100 మీటర్ల దూరంలో ఉన్న సంపునకు కనెక్షన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మోటార్‌, పైపులకు అయ్యే ఖర్చులకు ఎస్టిమేషన సిద్ధంగా ఉంది. గ్రామ పంచాయతీ అధికారుల నిర్ణయం కోసం వేచి చూస్తున్నాం.

- అత్తార్‌, డీఈ, మిషన భగీరథ గ్రిడ్‌

Updated Date - Jul 07 , 2025 | 12:29 AM