ప్రజాపాటకు బహువచనం ప్రజానాట్యమండలి
ABN , Publish Date - Aug 21 , 2025 | 12:44 AM
ప్రజాపాటకు బహువచనం ప్రజానాట్యమండలి అని సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ అన్నారు.
సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ
రామన్నపేట, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): ప్రజాపాటకు బహువచనం ప్రజానాట్యమండలి అని సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ అన్నారు. ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో యాదాద్రిభువనగిరి జిల్లా రామన్నపేట మండలకేంద్రంలోని స్థానిక పాత బస్టాండ్ ఆవరణలో బుధవారం జరిగిన వీధినాటక ఉత్సవాల సభలో ఆయన మాట్లాడారు. నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుంచి నేటి ప్రజాపోరాటాలకు వరకు ప్రజానాట్యమండలిది వన్నె తగ్గదని పాత్ర అని అన్నారు. జానపద రూపాలు అంతరించిపోతున్న తరుణంలో సబ్బండ కళారూపాల ప్రదర్శన నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రజా కళలకు చావులేదని, భూ ప్రపంచం ఉన్నంతవరకు ప్రజా పోరాటాలు ఉన్నంతవరకు పాటకు ప్రాణం ఉంటుందన్నారు. మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ ప్రజా పోరాటాలకు ఆయుధం ఇచ్చింది కళారూపాలే అన్నారు. నేటి ప్రపంచీకరణ నేపథ్యంలో వస్తున్న వింత పోకడలో ప్రజా కళలు పెట్టుబడిదారులు చేతుల్లోకి వెళు తున్నాయని, సినిమాలు ఇతర రూపాల్లో అవి వికృత రూపం దాల్చుకుం టున్నాయన్నారు. కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి జిల్లా కోఆర్డినేటర్ ప్రజా గాయని వేముల పుష్ప, ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నరసింహ, మాజీ నాయకులు ఎండీ జహంగీర్, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గంటపాక శివకుమార్, ఈర్లపల్లి ముత్యాలు, దేశపాక రవి, కూరెళ్ళ నరసింహచారి తదితరులు పాల్గొన్నారు.