kumaram bheem asifabad- గిరిజన ఆవాసాల అభివృద్ధే ధ్యేయం
ABN , Publish Date - Jul 16 , 2025 | 11:12 PM
vప్రధానమంత్రి జన్ మన్ పథకం ద్వారా గిరిజన ఆవాసాల అభివృద్ధే ధ్యేయంగా కేంద్రం చర్యలు తీసుకుంటోందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల, కార్పొరేట్ వ్యవహరాల శాఖ సహాయ మంత్రి హర్షమల్హోత్రా అన్నారు. తిర్యాణి మండలం సుంగాపూర్ గ్రామంలోని శాటిలైట్ సెంటర్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం ఏర్పాటు చేసిన ప్రధాన మంత్రి జన్ మన్ పథకం కార్యక్రమానికి కలెక్టర్ వెంకటేష్ దోత్రే, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఎమ్మెల్యే కోవ లక్ష్మిలతో కలిసి హాజరయ్యారు.
తిర్యాణి, జూలై 16(ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి జన్ మన్ పథకం ద్వారా గిరిజన ఆవాసాల అభివృద్ధే ధ్యేయంగా కేంద్రం చర్యలు తీసుకుంటోందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల, కార్పొరేట్ వ్యవహరాల శాఖ సహాయ మంత్రి హర్షమల్హోత్రా అన్నారు. తిర్యాణి మండలం సుంగాపూర్ గ్రామంలోని శాటిలైట్ సెంటర్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం ఏర్పాటు చేసిన ప్రధాన మంత్రి జన్ మన్ పథకం కార్యక్రమానికి కలెక్టర్ వెంకటేష్ దోత్రే, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఎమ్మెల్యే కోవ లక్ష్మిలతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా గిరిజనులు సంప్రదాయ గుస్సాడీ నృత్యం ద్వారా స్వాగతం పలికారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా శాటిలైట్ సెంటర్ పాఠశాల ఆవరణలో అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. పీవీటీజీల సాంప్రదాయ దేవతల పటాలకు, శాటిలైట్ సెంటర్ పాఠశాల స్థల ప్రదాత టేకం భీంపటేల్ విగ్రహాలకు పూజలు చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాన మంత్రి జన్మన్ పథకంలో భాగంగా పీవీటీజీల కొరకు ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రాన్ని పరిశీలించారు. ఆధార్ కార్డు లేని వారిని గుర్తించి వెంటనే ఆధార్ కార్డులు జారీ చేయాలని సూచించారు. ఆర్థిక అక్షరాస్యత స్టాల్ పరిశీలించి ఆదివాసీ గిరిజనులకు ఆర్థిక అక్షర్యాతపై అవగాహన కల్పించాలని, కేంద్ర ప్రభుత్వం చేపట్టే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి, అటల్ బీమా యోజన, అటల్ పెన్షన్యోజన, ముద్రరుణాలపై అవగాహన కల్పించాలని చెప్పారు. ప్రధాన మంత్రి విశ్వకర్మ బ్యాంకు లింకేజీలపై ప్రత్యేక చర్యలుతీసుకోవాలని, ప్రధాన మంత్రి జన్మన్ కింద పీవీటీజీ గిరిజనులకు 11 రకాల వ్యాధుల పరీక్షలు నిర్వహించి వ్యాధి తీవ్రతను గుర్తించి అవసరమైన మందులు, శస్త్ర చికిత్సలు అందించాలన్నారు. పీవీటీజీ గ్రామాల్లో మొబైల్ యూనిట్ ద్వారా వైద్య సేవలు అందించం జరుగుతుందని తెలిపారు పీవీటీజీ గ్రామాలలో బహుళార్థక ప్రయోజన కేంద్రాల నిర్మాణాలు చేపట్టి ఒకే దగ్గర గిరిజనులకు సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, మత్స్య సంపద అభివృద్ధి దిశగా ప్రత్యేక చర్యలు చేపడుతుందని తెలిపారు. ప్రధాన మంత్రి జన్ మన్ పథకం కింద రూ.2.50 కోట్లతో అదనపు తరగతి గదుల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. తిర్యాణి మండలం అస్పిరేషనల్ బ్లాక్గా గుర్తించడం ద్వారా పీవీటజీ గ్రామాలలో రహదారులు, తాగునీరు, వైద్యసేవలు, బహుళార్థక ప్రయోజన కేంద్రాల నిర్మాణాలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణాలు, మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని తెలిపారు .సాంప్రదాయ పద్దతి, గుస్సాడీ నృత్యం ద్వారా స్వాగతం పలికిన గుస్సాడీ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కేంద్ర సహాయ మంత్రి చేతుల మీదుగా ఆధార్, జాబ్ కార్డు, జనన ఽధ్రువీకరణ పత్రాలు, జన్ధన్ ఖాతా పుస్తకాలు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమాధికారి రమాదేవి, జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతి, విద్యుత్ శాఖ ఎస్ఈ శేషరావు, పంచాయతీ రాజ్ ఈఈ కృష్ణ, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
వాంకిడి, (ఆంధ్రజ్యోతి): అనారోగ్య సమస్యలతో ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కేంద్ర రోడ్డు, రవాణా, రహదారులు, కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయమంత్రి హర్ష మల్హోత్రా అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వైద్యశాలలో మందుల నిల్వలు, రోగులకు అందుతున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేవిధంగా వైద్యాదికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు. అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద వచ్చే నిధులను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. గర్భిణులు సకాలంలో అవసరమైన పరీక్షలు నిర్వహించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. అనంతరం మండలంలోని లింబుగుడ గ్రామంలో పీవీటీజీ ప్రధాన మంత్రి జన్ మన్ పథకం కింద రూ. 60 లక్షలతో నిర్మించిన బహుళార్థక ప్రయోజన కేంద్రాన్ని సందర్శించారు. కేంద్రంలో గల అంగన్వాడీ కేంద్రం, ఆరోగ్య కేంద్రం, కంప్యూటర్ తరగతి గది, పంచాయతీ కార్యదర్శి గదిని పరిశీలించారు. వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ తరగతులను విద్యార్థులతో కలిసి వీక్షించారు. గ్రామాలలో మహుళార్థక ప్రయోజన కేంద్రాలు సంతృప్తికరంగా ఉన్నాయని చెప్పారు. ఈ కేంద్రాల ద్వారా అన్ని రకాల సేవలు ఒకే చోట అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అంతకు ముందు గ్రామానికి వచ్చేసిన కేంద్ర సహాయ మంత్రి, అధికారులతో కలిసి గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ చేశారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆడేపు భాస్కర్, జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతి, జిల్లా వైద్య శాఖ అధికారి సీతారాం, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.