ఫారెస్టు మేనేజర్ను బదిలీ చేయాలి
ABN , Publish Date - Oct 15 , 2025 | 11:03 PM
ఎస్టీపీపీ నర్సరీల్లో పనిచేస్తున్న ఫారెస్టు మహిళ కాంట్రాక్టు కార్మికులను తీవ్రంగా వేధింపులకు గురవుతున్నారని పేర్కొంటూ బుధవారం హెచ్ఎంఎస్ నాయకులు , నర్సరీ మహిళ కార్మికులు ధర్నా చేపట్టారు.
-హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో ధర్నా
జైపూర్, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి) : ఎస్టీపీపీ నర్సరీల్లో పనిచేస్తున్న ఫారెస్టు మహిళ కాంట్రాక్టు కార్మికులను తీవ్రంగా వేధింపులకు గురవుతున్నారని పేర్కొంటూ బుధవారం హెచ్ఎంఎస్ నాయకులు , నర్సరీ మహిళ కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా హెచ్ఎంఎస్ అధ్యక్షుడు తిప్పారపు సారయ్య మాట్లాడుతూ ఫారెస్టు మేనేజర్ చంద్రమణి మహిళ కార్మికులను అసభ్య పద జాలంతో దూషించడం, అనవసరంగా మానసిక ఒత్తిడికి గురి చేయడం, వర్షాలు పడితే పని బంద్ చేసి జీతాలు ఇవ్వకపోవడం, పనికి వచ్చినా మస్టరు ఇవ్వకపోవడం వంటి చర్యలతో కార్మికులు తీవ్ర మనస్ధాపానికి గురవుతున్నారన్నారు. ప్రతి రోజు 200 నుంచి 300 మీటర్లు పనిచేయాలని భారం మోపుతూ పనిచేయలేని కార్మికులకు వార్నింగ్ లెటర్లు జారీ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. తక్షణమే చంద్రమణిని వేరే డివిజన్కు బదిలీ చేయాలన్నారు. విషయం తెలుసుకుని జీఎం నర్సింహారావు, డీజీఎం పర్సనల్ కిరణ్బాబులు సంఘటన స్థలానికి వచ్చారు. కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతోధర్నాను విరమించారు. అనంతరం జీఎంకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీపీపీ హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ విక్రమ్కుమార్, ఉపాధ్యక్షులు సాయికృష్ణ, చిప్పకుర్తి సంపత్,నవీన్ తదితరులు పాల్గొన్నారు.