Share News

kumaram bheem asifabad- తాగునీటి సమస్య పరిష్కరించాలి

ABN , Publish Date - Jun 23 , 2025 | 11:24 PM

: తాగునీటి కోసం బాబేఝరి, మహారాజ్‌గూడతో పాటు పోరుగ్రామాల ప్రజలు సోమవారం తాగునీటి సమస్య పరిష్కరించాలని మండల కేంద్రంలో ఆదిలాబాద్‌- ఆసిఫాబాద్‌ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు.

kumaram bheem asifabad- తాగునీటి సమస్య పరిష్కరించాలి
రాస్తారోకో నిర్వహిస్తున్న గ్రామస్థులు

కెరమెరి, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): తాగునీటి కోసం బాబేఝరి, మహారాజ్‌గూడతో పాటు పోరుగ్రామాల ప్రజలు సోమవారం తాగునీటి సమస్య పరిష్కరించాలని మండల కేంద్రంలో ఆదిలాబాద్‌- ఆసిఫాబాద్‌ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తమ గ్రామాల్లో ఉన్న బావిలో తాగునీరు అడుగుంటి పోవడంతో పాటు మిషన్‌ భగీరథ నీరు సైతం గత 30 రోజులుగా రావడం లేదని చెప్పారు. వేసవిలో తమ గ్రామాన్ని సందర్శిం చిన అధికారులు ట్యాంకర్ల ద్వారా మంచినీటిని అందజేస్తామని చెప్పారని అన్నారు. కానీ ట్యాంకర్‌ ద్వారా మంచినీరు అం దించడం లేదన్నారు. దీంతో తమకు నీరు కోసం చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్థులు తెలిపారు. కాగా సుమారు అర గంటకుపైగా రోడ్డుపై రాస్తారోకో చేపట్టడంతో ఇరువైపులా వాహనాలు నిలిచి పోయాయి. సంఘటన స్థలానికి ఎస్సై మధుకర్‌ చేరుకుని రాస్తారోకో విరమింపజేశారు. అనంతరం ఎంపీడీవో కార్యాయంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ విశ్వేశ్వర్‌కు గ్రామస్థులు వినతి పత్రం అందజేశారు. ఏఈ విశ్వేశ్వర్‌ స్పందించి ట్యాంకర్‌ ద్వారా నీరు అందజేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో బాబే ఝరి, మహారాజ్‌గూడ గ్రామానికి చెందిన ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాంకర్‌ ద్వారా నీరందిస్తాం

కెరమెరి, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): వాటర్‌ ట్యాంకర్‌ ద్వారా నీరందిస్తామని డీపీవో భిక్షపతిగౌడ్‌ అన్నారు. బాబేఝరి, మహారాజ్‌గూడ గ్రామాల్లో నెలకొన్న నీటి ఎద్దడిని సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నీటి ఎద్దడి గల కారణాలను డీపీవో అడిగి తెలుసుకున్నారు. చేతి పంపులు, బావులలో భూగర్భ జలాలు అడుగంటి పోవడం వల్లే సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. భూగర్భ జలాలు పెరిగే వరకు గ్రామాల్లో ట్యాంకర్‌ ద్వారా నీరందిస్తామని తెలిపారు. ఆయన వెంట ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు మతీన్‌హైమద్‌, ఏఈ విశ్వేశ్వర్‌, ఎంపీడీవో అంజద్‌పాషా తదితరులు ఉన్నారు.

Updated Date - Jun 23 , 2025 | 11:24 PM