Tenant Farmer Ends Life: అప్పులు తీర్చలేక చచ్చిపోతున్నా!
ABN , Publish Date - Dec 01 , 2025 | 05:17 AM
ఆరుగాలం పండించిన పంటలకు మద్దతు ధర రావట్లేదు. నేను చేసిన అప్పులు తీర్చే పరిస్థితి కనిపించడం లేదు. గత్యంతరం లేని పరిస్ధితిలో...
ఖమ్మం జిల్లాలో కౌలు రైతు ఆత్మహత్య
పురుగు మందు తాగుతూ సెల్ఫీ వీడియో
నేలకొండపల్లి, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): ‘ఆరుగాలం పండించిన పంటలకు మద్దతు ధర రావట్లేదు. నేను చేసిన అప్పులు తీర్చే పరిస్థితి కనిపించడం లేదు. గత్యంతరం లేని పరిస్ధితిలో ఆత్మహత్యే నాకు శరణ్యం..’ అంటూ ఓ రైతు పురుగు మందు తాగుతూ సెల్ఫోన్లో సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్య చేసుకున్నాడు. రైతుల పంటలకు మద్దతు ధరను ఇవ్వాలని అదే వీడియో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం శంకరగిరితండాలో శనివారం జరిగింది. తండాకు చెందిన కౌలు రైతు బానోతు వీరన్న (28) పదెకరాలు కౌలుకు తీసుకుని వాణిజ్య పంటలైన మిర్చి, పత్తి, చెరుకును సాగు చేస్తున్నాడు. పంటల సాగు కోసం సుమారు రూ.15 లక్షలు అప్పు చేశాడు. పంట చేతికొచ్చేసరికి ధరలు లేకపోవడం.. మార్కెట్లో డిమాండ్ లేకపోవడంతో.. అప్పులు తీర్చేమార్గం లేక.. జీవితంపై విరక్తితో శనివారం సాయంత్రం పురుగుల మందు తాగాడు. బంధువులు వీరన్నను చికిత్స కోసం ఖమ్మంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో.. ఆదివారం తెల్లవారుజామున వీరన్న మృతి చెందాడు. కాగా, రైతుల పరిస్ధితి ముఖ్యంగా కౌలు రైతుల పరిస్ధితి దారుణంగా ఉందని సెల్ఫీ వీడియోలో వీరన్న ఆవేదన వ్యక్తం చేశాడు. తాను తెచ్చిన అప్పులు తీర్చే దారి లేకనే.. గత్యంతరం లేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నాడు.