Srisailam Project: శ్రీశైలం ప్రాజెక్టును ఖాళీ చేయొద్దు!
ABN , Publish Date - Oct 23 , 2025 | 05:44 AM
భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వలను కాపాడాలని, దీనికోసం కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో...
విద్యుదుత్పాదన నిలిపివేయాలని ఏపీని కోరనున్న తెలంగాణ
హైదరాబాద్/నాగార్జునసాగర్, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వలను కాపాడాలని, దీనికోసం కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుతుత్పాదనను నిలువరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టులో నీటి మట్టం కొనసాగించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వంతో పాటు తెలంగాణ, ఏపీ జెన్కోలకు గురువారం రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయనుంది. ఈ ఏడాది శ్రీశైలం ప్రాజెక్టుకు 2200 టీఎంసీలకు పైగా గరిష్ఠ వరద వచ్చింది. రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 194.76 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇక బుధవారం ప్రాజెక్టుకు 23 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా... ఔట్ ఫ్లో 43 వేల క్యూసెక్కులుగా రికార్డయింది. ఇక నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నిల్వ 312.05 టీఎంసీలు కాగా... ప్రాజెక్టులో 305.86 టీఎంసీల నిల్వ ఉంది. ప్రాజెక్టుకు 36 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. అంతే ఔట్ఫ్లో ఉంది. శ్రీశైలంలో 21 టీఎంసీల మేర, సాగర్లో మరో 6.19 టీఎంసీల మేర నిల్వ చేసుకునే అవకాశాలున్నా.. జలవిద్యుత్ ఉత్పాదనతో నీరంతా సముద్రంలోకి వృథా గా పోతుండటంతో దీన్ని అడ్డుకునే యత్నాలను ప్రభుత్వం ప్రారంభించింది. కాగా, నాగార్జునసాగర్ ఎడమ కాల్వ జలవిద్యుత్ కేంద్రంలో రికార్డు స్థాయిలో విద్యుదు త్పత్తి జరిగింది. సంవత్సర కాలానికి పెట్టుకున్న లక్ష్యాన్ని కేవలం 3నెలల్లో చేరుకున్నట్లు జెన్కో అధికారులు తెలిపారు. 2025-26 సంవత్సరానికి 70మిలియన్ యూని ట్లు విద్యుత్ ఉత్పత్తి చేయాలనే లక్ష్యాన్ని మంగళవారం నాటికే చేరుకోవడంతో ఇంజనీర్లు బుధవారం జెన్కో ఆఫీసులో కేక్ కట్చేసి సంబురాలు చేసుకున్నారు. ఈ ఏడాది జూలై 21న విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించామని అధికారులు తెలిపారు.