Minister Komatireddy Venkat Reddy: అన్ని రంగాలు ఒకేసారి అభివృద్ధి చెందేలా ప్రణాళిక సిద్ధం
ABN , Publish Date - Dec 10 , 2025 | 03:49 AM
రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి వ్యూహం ఒక్క రంగానికి పరిమితం కాలేదని.. రోడ్లు, రైల్వే, విమానయాన ం, సాంకేతిక, మౌలిక వసతుల కల్పన సహా అన్ని.....
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
తెలంగాణ రోడ్ సెక్టార్ పాలసీని ఆవిష్కరించిన సీఎం రేవంత్
హైదరాబాద్, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి వ్యూహం ఒక్క రంగానికి పరిమితం కాలేదని.. రోడ్లు, రైల్వే, విమానయాన ం, సాంకేతిక, మౌలిక వసతుల కల్పన సహా అన్ని రంగాలు ఒకేసారి అభివృద్ధి చెందేలా ప్రణాళికలు సిద్ధం చేశామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గ్లోబల్ సమ్మిట్లో భాగంగా నిర్వహించిన ‘‘కనెక్టెడ్ తెలంగాణ-ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్- అర్బన్ అండ్ రూరల్ కనెక్టివిటీ’’పై జరిగిన ప్యానెల్ చర్చలో మంత్రి మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో రాష్ట్రమంతా సమగ్రాభివృద్ధి జరిగేలా అనేక కొత్త సంస్కరణలు, పెద్ద ప్రాజెక్టులు ప్రారంభించామన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా రోడ్ సెక్టార్ పాలసీని తీసుకువచ్చామని.. ఇది ‘రైజింగ్ తెలంగాణ రోడ్ డెవల్పమెంట్ ప్రోగ్రామ్’’కు పునాది అని, రాష్ట్రాన్ని బలమైన ఆర్థిక కేంద్రంగా మార్చడానికి ఇది కీలకమన్నారు. తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు పరిశ్రమలు, సరుకు రవాణా కోసం ప్రత్యేక రైల్వే కారిడార్లు, హై స్పీడ్, బుల్లెట్ రైలు ప్రాజెక్టులు సహా కొత్త రహదారుల ప్రాజెక్టులను ప్రతిపాదిస్తున్నామని, ఈ ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలని పెట్టుబడిదారులకు విజ్ఞప్తి చేశారు. చర్చలో మోర్త్ అడిషనల్ డీజీ రాహుల్గుప్తా, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వె్స్టమెంట్ బ్యాంకు (ఏఐఐబీ) ప్రతినిధి హరిభాస్కర్, లీ అసోసియేషన్ చైర్మన్ ఫణిరాజు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. తెలంగాణ రోడ్ సెక్టార్ పాలసీ డాక్యుమెంట్ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి సీఎం రేవంత్రెడ్డి గ్లోబల్ సమ్మిట్లో భాగంగా ఆవిష్కరించారు. ఇందులోని అంశాల గురించి సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొత్త ప్రాజెక్టులు, 2047 నాటికి రాష్ట్రంలో నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్న రోడ్లు, అందుకయ్యే ఖర్చు, నిధుల సమీకరణ సహా పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో ఆర్ అండ్ బీ పరిధిలో ప్రస్తుతం ఉన్న 46వేల కిలోమీటర్ల రహదారి వ్యవస్థను 2047నాటికి 1,15,000 కిలోమీటర్లకు పెంచడం లక్ష్యమని డాక్యుమెంట్లో పేర్కొన్నారు. 2047నాటికి రాష్ట్రంలో 1800 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ వేలను నిర్మించాలనుకుంటున్నారు.