National Lok Adalat: లోక్అదాలత్లో 11 లక్షల కేసులు పరిష్కారం
ABN , Publish Date - Sep 14 , 2025 | 05:50 AM
నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నాల్సా) ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 11లక్షలపైగా కేసులు పరిష్కారమయ్యాయి...
హైదరాబాద్, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నాల్సా) ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 11లక్షలపైగా కేసులు పరిష్కారమయ్యాయి. బాధితులకు రూ.595 కోట్లు పరిహారంగా అందజేశారు. తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్య కార్యదర్శి సీహెచ్ పంచాక్షరి శనివారం ఈ విషయాన్ని వెల్లడించారు. స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైౖర్మన్, హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ పి.శ్యాంకోషీ లోక్అదాలత్ కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షించారు. నిర్మల్ జిల్లాలో ఆయన లోక్అదాలత్ను ప్రారంభించి, కేసులకు సంబంధించిన చెక్కులను కక్షిదారులకు అందజేశారు. అలాగే, హైకోర్టు ప్రాంగణంలో హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్పర్సన్ జస్టిస్ మౌషమీ భట్టాచార్య పర్యవేక్షణలో లోక్అదాలత్ జరిగింది. ఇందులో 2016లో రోడ్డు ప్రమాదంలో వైకల్యం పొందిన ఓ విద్యార్థికి న్యూఇండియా అస్యూరెన్స్ కంపెనీ రూ.1.20 కోట్లు పరిహారంగా అందజేసి కేసులో రాజీకుదర్చుకుంది. ఈ చెక్కును జస్టిస్ మౌషమీ భట్టాచార్య బాధిత వ్యక్తికి అందజేశారు.