Share News

Supreme Court: బనకచర్ల, ఆల్మట్టిపై సుప్రీంకు!

ABN , Publish Date - Nov 05 , 2025 | 04:19 AM

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపడుతున్న పోలవరం-బనకచర్ల అనుసంధానంతో పాటు కర్ణాటక ప్రభుత్వం చేపడుతున్న ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు...

Supreme Court: బనకచర్ల, ఆల్మట్టిపై సుప్రీంకు!

  • కేసులు వేసేందుకు తెలంగాణ సన్నద్ధం

హైదరాబాద్‌, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపడుతున్న పోలవరం-బనకచర్ల అనుసంధానంతో పాటు కర్ణాటక ప్రభుత్వం చేపడుతున్న ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపును అడ్డుకోవడానికి సుప్రీంకోర్టును ఆశ్రయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఆల్మట్టి ప్రాజెక్టుపై ఇప్పటికే సుప్రీంకోర్టులో ఒక కేసు ఉంది. తాజాగా మరో ఇంటర్‌లొక్యూటరీ అప్లికేషన్‌(ఐఏ) వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆల్మట్టి డ్యాంలో 524.256 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేలా పనులను 2002 నాటికే కర్ణాటక సర్కారు నిర్మాణం పూర్తి చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో 519.06 మీటర్ల ఎత్తు మేరకే(129.72 టీఎంసీ) నీటిని నిల్వను పరిమితం చేసింది. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు పనులు పూర్తి చేశామని, నీటి కేటాయింపులు చేయకపోతే ఆ పనులకు చేసిన వ్యయం వృథా అవుతుందని బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ ఎదుట కర్ణాటక ప్రభుత్వం వాదించింది. ఆ వాదనతో ఏకీభవించిన ట్రైబ్యునల్‌ అప్పర్‌ కృష్ణా ప్రాజెక్టుకు గతంలో బచావత్‌ ట్రైబ్యునల్‌ 75ు లభ్యత ప్రాతిపదికన కేటాయించిన 173 టీఎంసీలను కొనసాగిస్తూ, 65ు లభ్యత ఆధారంగా మరో 130 టీఎంసీలను కేటాయించింది. 524.256 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసుకోవడానికి అనుమతి ఇస్తూ 2013, నవంబరు 29న కేంద్రానికి తుది నివేదిక ఇచ్చింది. దాన్ని ఉమ్మడి ఏపీ, మహారాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో సవాలు చేశాయి. దాంతో బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ తుది నివేదికను అమలును సుప్రీంకోర్టు నిలిపేసింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ సైతం ఈ కేసులో ప్రతివాదిగా చేరింది. 524.256 మీటర్ల ఎత్తువరకు నీళ్లు నిల్వ చేస్తే ముంపునకు గురయ్యే 20 గ్రామాలు, బాగల్‌కోట మున్సిపాల్టీలో 11 వార్డుల ప్రజలకు పునరావాసంతో పునర్‌నిర్మాణం కోసం 75,663 ఎకరాల భూసేకరణకు రూ.70 వేల కోట్లను మంజూరు చేస్తూ కర్ణాటక మంత్రివర్గం గత సెప్టెంబరు 17న నిర్ణయం తీసుకుంది. కేసు పరిష్కారం కాకముందే కర్ణాటక ఆల్మట్టి ఎత్తు పెంపునకు ముందుకు వెళ్తుండటాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు మరో ఇంటర్‌లొక్యూటరీ అప్లికేషన్‌ దాఖలుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.


పోలవరం-బనకరచర్ల అనుసంధానంపై..

తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా ఏపీ ప్రభుత్వం పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు డీపీఆర్‌ రూపకల్పన కోసం టెండర్లను ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే కేంద్ర జలశక్తి శాఖతో పాటు కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. కేంద్ర జల వనరుల సంఘం(సీడబ్ల్యూసీ) మార్గదర్శకాల ప్రకారం ప్రాజెక్టు డీపీఆర్‌ తయారీతో పాటు అవసరమైన పరిశోధనలు, కేంద్రం నుంచి చట్టపరమైన అనుమతులు పొందడానికి సహకారం కోరుతూ ఏపీ రాష్ట్ర జల వనరుల శాఖ గత నెల 7న టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. పోలవరం నుంచి బనకచర్లకు 200 టీఎంసీల గోదావరి జలాలను తరలించే ప్రాజెక్టుకి అనుమతి కోసం సీడబ్ల్యూసీకి గత మే 22న పీఎ్‌ఫఆర్‌(ప్రీ ఫీజుబులిటీ రిపోర్టు)ను ఏపీ సమర్పించింది. దీనిపై తెలంగాణ సహా బేసిన్‌ పరిధిలోని ఇతర రాష్ట్రాలు, గోదావరి, కృష్ణా బోర్డు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)తో పాటు స్వయంగా సీడబ్ల్యూసీ ఈ ప్రతిపాదనలపై తీవ్ర ఆక్షేపణ తెలిపాయి. పర్యావరణ అనుమతి కోసం దరఖాస్తు చేయడానికి నిర్వహించాల్సిన పర్యావరణ ప్రభావ మదింపు(ఈఐఏ)కి నియమ, నిబంధనలు(టీవోఆర్‌) జారీ చేయాలని ఏపీ చేసుకున్న దరఖాస్తును కేంద్ర అటవీ, పర్యావరణ శాఖలోని నిపుణుల మదింపు కమిటీ గత జూన్‌ 30న తోసిపుచ్చింది. గోదావరిలో వరద జలాల లభ్యత, అంతర్రాష్ట అనుమతి తర్వాతే టీవోఆర్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. అయినా, ఈ ప్రాజెక్టు డీపీఆర్‌ విషయంలో ఏపీ ముందుకెళ్లడం, అడ్డుకునేందుకు కేంద్రం చర్యలు తీసుకోకపోవడంతో సుప్రీంకోర్టులో కేసు దాఖలు ఒక్కటే మార్గమని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. సుప్రీంకోర్టులో కేసు వేయడం ద్వారా ఆ ప్రాజెక్టుకు పరోక్షంగా చట్టబద్ధత కల్పించినట్లవుతుందని, కేసును సుప్రీం స్వీకరిస్తే ఏ వేదికల్లోనూ వ్యతిరేకించడానికి అవకాశం లేకుండా పోతుందని జలవనరుల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేసు వేయడం విపక్షం వేసిన ఉచ్చులో చిక్కుకోవడమేనని అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Nov 05 , 2025 | 04:19 AM