Telangana jails security: తెలంగాణ జైళ్లల్లో తమిళనాడు విధానం
ABN , Publish Date - Apr 18 , 2025 | 05:07 AM
తెలంగాణ జైళ్లలో భద్రతను బలోపేతం చేసేందుకు తమిళనాడు తరహా విధానాన్ని అమలు చేయనున్నారు. జైళ్ల సిబ్బందికి బాడీవోర్న్ కెమెరాలు ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు.

తెలంగాణ జైళ్లల్లో తమిళనాడు తరహా విధానాన్ని అమలు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. నకిలీ బెయిల్ పత్రాలతో ఖైదీ విడుదల.. రిమాండ్ ఖైదీతో రీల్స్.. ఇలా ఇటీవలి కాలంలో జైళ్లలో వెలుగు చూసిన ఘటనల నేపథ్యంలో భద్రత చర్యల్లో భాగంగా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇకపై ఇలాంటి సంఘటనలకు అవకాశం లేకుండా.. భద్రతను కట్టుదిట్టం చేయడంపై ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో చర్చించారు. తమిళనాడు తరహాలో.. జైళ్లశాఖ సిబ్బందికి బాడీవోర్న్ కెమెరాలను సమకూర్చాలని తీర్మానించారు.
రాష్ట్రంలోని కారాగారాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినా.. భద్రత లోపాలు అడపాదడపా బయటపడుతున్నాయి. ఖైదీలతో అంటకాగే సిబ్బందిపై నిఘా అవసరమని భావించిన అధికారులు.. బాడీవోర్న్ కెమెరాలొక్కటే పరిష్కారమని భావిస్తున్నారు. ఈ కెమెరాలు వైర్లెస్ వ్యవస్థలకు అనుసంధానమై ఉంటాయి. దీని వల్ల కంట్రోల్రూమ్లో, ఉన్నతాధికారులు తమ కార్యాలయాల్లో ఎప్పటికప్పుడు లైవ్గా పరిస్థితిని పర్యవేక్షించే వెసులుబాటు కలుగుతుంది.