Telangana State Election Commission: మోగిన నగారా
ABN , Publish Date - Nov 26 , 2025 | 05:17 AM
తెలంగాణలో గ్రామపంచాయతీ ఎన్నికల నగారా మోగింది. గురువారం నవంబరు 27 ప్రారంభమయ్యే సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల ప్రక్రియ.. డిసెంబర్ 17 నాటికి పూర్తికానుంది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని మంగళవారం షెడ్యూల్ విడుదల చేశారు.....
పంచాయతీ ఎన్నికల ప్రక్రియ షురూ
షెడ్యూల్ ప్రకటించిన ఎస్ఈసీ.. అమల్లోకి కోడ్.. రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ
12,728 సర్పంచ్, 1,12,242 వార్డు సభ్యుల స్థానాలకు మూడు విడతలుగా ఎన్నికలు
వచ్చే నెల 11, 14, 17 తేదీల్లో పోలింగ్.. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట దాకా..
2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ.. ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలున్నా పోటీకి అర్హులే
రాష్ట్రంలో గ్రామీణ ఓటర్లు 1,66,55,186 మంది.. మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువ
హైదరాబాద్, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో గ్రామపంచాయతీ ఎన్నికల నగారా మోగింది. గురువారం (నవంబరు 27) ప్రారంభమయ్యే సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల ప్రక్రియ.. డిసెంబర్ 17 నాటికి పూర్తికానుంది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని మంగళవారం షెడ్యూల్ విడుదల చేశారు. ఎస్ఈసీ కార్యాల యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ డైరెక్టర్ సృజన, పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 12,728 సర్పంచ్ స్థానాలకు, 1,12,242 వార్డు సభ్యుల స్థానాలకు మొత్తం 3 విడతల్లో ఎన్నికలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. పోలింగ్ పూర్తయిన తర్వాత.. అదేరోజు ఓట్ల లెక్కింపు జరిపి, ఫలితాలను ప్రకటించనున్నట్లు తెలిపారు. డిసెంబరు 11, 14, 17 తేదీల్లో పోలింగ్ ఉంటుందని.. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి, మధ్యాహ్నం 2గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు తెలిపారు. అదే సమయంలో ఉపసర్పంచ్ ఎన్నిక ప్రక్రియను సంబంధిత విభాగాలు పూర్తిచేస్తాయని చెప్పారు. ప్రభుత్వం జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్ ఆధారంగా.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ ఖరారు చేసినట్లు ఎస్ఈసీ వెల్లడించారు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో.. తక్షణమే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని స్పష్టంచేశారు. ఈసీఐ అందజేసిన ఓటరు జాబితాను ఆధారంగా చేసుకొని తుదిఓటరు జాబితాను గ్రామపంచాయతీ, వార్డుల వారిగా ఇప్పటికే సిద్ధం చేసినట్టు రాణి కుముదిని వివరించారు. విడతలవారీగా చేపట్టే ఈ ఎన్నికలకు సంబంధించి.. నోటిఫికేషన్ జారీచేసే రోజు నుంచే ఆ విడత ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలవుతుందని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లూ పూర్తిచేశామని.. ఎక్కడా అడ్డంకులు లేకుండా గ్రామపంచాయతీ ఎన్నికలను సమర్థంగా నిర్వహించేలా.. అన్ని జిల్లాల కలెక్టర్లతో సమన్వం చేసుకుంటామని ఎస్ఈసీ రాణి కుముదిని వెల్లడించారు.
ఏయే విడతలో ఎన్నంటే..
రాష్ట్రవ్యాప్తంగా 12,728 సర్పంచు స్థానాలు, 1,12,288 వార్డులకుగాను.. తొలివిడతలో భాగంగా డిసెంబర్ 11న 4,236 సర్పంచ్, 37,440 వార్డుసభ్యుల స్థానాలకు.. రెండోవిడతలో భాగంగా డిసెంబరు 14న 4,333 సర్పంచ్, 33,350 వార్డుసభ్యుల స్థానాలకు.. మూడోవిడతలో భాగంగా 4,159 సర్పంచ్, 36,452 వార్డుసభ్యుల స్థానాలకు డిసెంబర్ 17న పోలింగ్ జరగనుంది. సర్పంచ్ ఎన్నికలకుగాను 15,522.. వార్డుసభ్యుల ఎన్నికకు సంబంధించి 1,12,474 పోలింగ్ స్టేషన్లను ఎన్నికల విభాగాలు ఎంపిక చేశాయి. ఈ ఎన్నికలను పార్టీరహితంగా చేపడతారన్న సంగతి తెలిసిందే. ఇందుకు అనుగుణంగానే రాష్ట్ర ఎన్నికల సంఘం.. ఎన్నికల సామగ్రిని ఇప్పటికే సిద్ధం చేసింది. గ్రామ పంచాయతీల పరిధిలో పోటీచేసే అభ్యర్థులకు కేటాయించాల్సిన గుర్తులను, బ్యాలెట్ పత్రాలను ఇప్పటికే ముద్రించింది. స్థానికంగా వచ్చే నామినేషన్ల ఆధారంగా ఆయా గుర్తులను అభ్యర్థులకు కేటాయించనున్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలోని 1,66,55,186 మంది గ్రామీణ ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషుల కన్నా మహిళలే ఎక్కువగా ఉన్నారు. మొత్తం ఓటర్లలో పురుషులు 81,52,231 మంది ఉండగా.. మహిళలు 85,12,455 మంది, ఇతరులు 500 మంది ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) సిద్ధం చేసిన ఓటర్ల తుదిజాబితా ఆధారంగా.. గ్రామపంచాయతీ, వార్డులవారీగా డీపీవోలు, ఎంపీడీవోల ద్వారా పరిశీలన జరిపి.. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకోసం రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా ఓటరు జాబితాను సిద్ధంచేసింది.
32 పంచాయతీలకు ఎన్నికల్లేవు
పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో అన్ని గ్రామాల్లో సందడి నెలకొంది. అయితే.. కొన్ని న్యాయపరమైన వివాదాల కారణంగా 32 పంచాయతీలకు ఈసారి ఎన్నికలను నిర్వహించడంలేదని ఎస్ఈసీ తెలిపింది. ములుగుజిల్లా మంగపేట మండలంలోని 25 గ్రామ పంచాయతీలకు, కరీంనగర్ జిల్లా వి.సైదాపూర్ మండలంలోని 2 గ్రామ పంచాయతీలకు, ఖమ్మంజిల్లా ఏన్కూరు మండలంలో 4 పంచాయతీలకు, అదే జిల్లాలోని పెనుబల్లి మండలంలో ఒక గ్రామ పంచాయతీకి ఎన్నికలు జరగడం లేదని ఎస్ఈసీ పేర్కొంది.
ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలున్నా..
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు ఇద్దరికంటే ఎక్కువమంది పిల్లలు ఉంటే అనర్హులు అనే విఽధానం చాలాకాలంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రప్రభుత్వం జారీచేసిన జీవో ప్రకారం ఈసారి స్థానికసంస్థల ఎన్నికల్లో, ప్రస్తుతం చేపట్టే పంచాయతీ ఎన్నికల్లోనూ ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్నవారు సైతం పోటీచేసేందుకు అర్హులే. గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా ప్రభుత్వం ఖరారుచేసిన ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్లపై భిన్నాభిప్రాయం వ్యక్తమవుతోంది. రిజర్వేషన్ల ప్రక్రియపై ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలకు అనుగుణంగా సర్పంచ్ స్థానాలకు సంబంధించి ఆర్డీవో, డీపీవోలు.. వార్డుసభ్యులకు సంబంధించి ఎంపీడీవోలు రిజర్వేషన్లను ఖరారుచేశారు. ఆయా జిల్లాల్లో జనాభాకు అనుగుణంగా.. బీసీ వర్గాలకు ఒక్కో చోట ఒక్కో విధంగా రిజర్వేషన్లు కల్పించినప్పటికీ.. బీసీలకు మొత్తంగా 17శాతం రిజర్వేషన్లు మాత్రమే దక్కాయని రాజకీయ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో.. 25శాతం, మరికొన్ని చోట్ల 23శాతం బీసీ రిజర్వేషన్లను కల్పించినట్లు బీసీవర్గాలు చెబుతున్నాయి.