Aid for Flood Affected Families: వరద బాధితులకు 12.99 కోట్ల తక్షణ సాయం
ABN , Publish Date - Nov 12 , 2025 | 02:44 AM
మొంథా తుఫాను ప్రభావంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ సాయం కింద...
హైదరాబాద్, నవంబరు 11 (ఆంధ్ర జ్యోతి): మొంథా తుఫాను ప్రభావంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ సాయం కింద రూ.12.99 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ మేరకు విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్లు పంపిన నివేదికల ప్రకారం 16 జిల్లాల పరిధిలో 8662 ఇళ్లు దెబ్బతిన్నాయని, వీరికి తక్షణ సహాయం కింద రూ.12.99 కోట్లు విడుదల చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నిధులు బాధితుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వరదల్లో మృతి చెందిన వారికి రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా, పశువులు కోల్పోతే ఒక్కోదానికి రూ.50 వేలు, గొర్రెలు, మేకలకు రూ.5000, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.15 వేల చొప్పున సహాయం అందించనున్నట్లు పేర్కొన్నారు.