Damodar Raja Narasimha: ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో 2 డయాలసిస్ యంత్రాలు
ABN , Publish Date - Nov 07 , 2025 | 02:01 AM
ప్రతి ప్రభుత్వ సాధారణ ఆస్పత్రి (జీజీహెచ్) ఎమర్జెన్సీలో 2 డయాలసిస్ యంత్రాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది..
35 బోధనాస్పత్రుల్లో డయాలసిస్ యంత్రాల ఏర్పాటు
సనత్ నగర్ టిమ్స్లో 10 బెడ్లతో కూడిన డయాలసిస్ సెంటర్
ప్రతి 25 కి.మీకి ఒక డయాలసిస్ కేంద్రంపై వైద్యశాఖ కసరత్తు
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర సమీక్షలో నిర్ణయం
హైదరాబాద్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): ప్రతి ప్రభుత్వ సాధారణ ఆస్పత్రి (జీజీహెచ్) ఎమర్జెన్సీలో 2 డయాలసిస్ యంత్రాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 35 బోధనాస్పత్రులలోని ఎమర్జెన్సీ విభాగంలోనూ 2 డయాలసిస్ యంత్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వైద్యారోగ్యశాఖ అధికారులతో గురువారం జరిగిన సమీక్షలో ఆ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెలలో సనత్నగర్లో ప్రారంభించే టిమ్స్లోనూ 10 బెడ్లతో కూడిన డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని 10 ప్రధాన ఆస్పత్రుల్లో 2 బెడ్లతో కూడిన డయాలసిస్ యంత్రాలను ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే రాష్ట్రంలో 102 ప్రభుత్వ డయాలసిస్ సెంటర్లు ఉచితంగా రోగులకు ేసవలు అందిస్తున్నాయి. రోజురోజుకూ డయాలసిస్ పేషంట్లు పెరుగుతుండటంతో మరో 80 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రతి 25 కి.మీ దూరానికో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయడానికి మ్యాపింగ్ సిద్ధం చేస్తున్న అధికారులు.. త్వరలోనే కొత్త సెంటర్లను రోగులకు అందుబాటులోకి తేవడానికి కసరత్తు చేస్తున్నారు.