Hyderabad Metro: పార్ట్-బీ మెట్రోకు డీపీఆర్ సిద్ధం
ABN , Publish Date - May 25 , 2025 | 05:26 AM
హైదరాబాద్ మెట్రో రెండో దశ పార్ట్-బీ కింద 3 కారిడార్ల డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టులు రాష్ట్ర ప్రభుత్వానికి అందాయి. ఈ 86.1 కిలోమీటర్ల ప్రాజెక్టుకు రూ.19,579 కోట్లు అంచనా ఖర్చు, క్యాబినెట్ ఆమోదం తర్వాత కేంద్రానికి పంపబడనుంది.

రాష్ట్ర సర్కారుకు చేరిన సమగ్ర నివేదిక.. ఈ నెల 8న పంపించిన హెచ్ఏఎంఎల్
క్యాబినెట్ ఆమోదం తర్వాత కేంద్రానికి
3 కారిడార్లకు 19,579కోట్ల వ్యయం!
హైదరాబాద్ సిటీ, మే 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధానిలోని మెట్రో రెండో దశలో భాగంగా పార్ట్-బీ కింద ప్రతిపాదించిన నార్త్సిటీ, ఫ్యూచర్సిటీ డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)లు రాష్ట్ర ప్రభుత్వానికి చేరాయి. ఆయా కారిడార్లలో సుమారు 6 నెలలపాటు క్షేత్రస్థాయిలో పర్యటించి అన్ని అంశాలపై అధ్యయనం చేసిన హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఏఎంఎల్) అధికారులు డీపీఆర్ను తయారు చేశారు. ఇటీవల జరిగిన బోర్డు మీటింగ్లో మరోసారి అన్ని అంశాలనూ కూలంకూషంగా చర్చించి, ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. రాష్ట్ర క్యాబినెట్ గ్రీన్సిగ్నల్ ఇచ్చిన తర్వాత కేంద్రానికి అందజేయాలని యోచిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నగరం నలుమూలలకూ మెట్రో రైలు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇందులో భాగంగా తొలుత నాగోల్-ఎయిర్పోర్టు (కారిడార్-4) 36.8 కిలోమీటర్లు, రాయ దుర్గ్- కోకాపేట్ (కారిడార్-5) 11.6 కిలోమీటర్లు, ఎంజీబీఎ్స-చాంద్రాయణగుట్ట (కారిడార్-6) 7.5 కిలోమీటర్లు, మియాపూర్- పటాన్చెరు (కారిడార్-7) 13.4 కిలోమీటర్లు, ఎల్బీనగర్- హయత్నగర్(కారిడార్-8) 7.1 కిలోమీటర్ల కారిడార్లను ప్రతిపాదించారు. కిలోమీటరుకు సుమారు రూ.318 కోట్ల అంచనా వ్యయంతో రూ.24,269 కోట్లను కేటాయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్గా (50:50) పద్ధతిన పనులు చేపట్టాలని నిర్ణయించారు. రెండో దశ విస్తరణలో భాగంగా తొలుత 5 కారిడార్లను మాత్రమే ప్రతిపాదించి డీపీఆర్లు తయారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం.. మెట్రో రైల్ అధికారులను ఆదేశించింది. అయితే నగరానికి ఉత్తరం వైపునకు కూడా మెట్రో రైలును తీసుకురావాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. దీంతో ఫేజ్-2 కింద తొలుత ప్రతిపాదించిన 5 కారిడార్ల డీపీఆర్ను పార్ట్-ఏగా తయారు చేయాలని, పార్ట్-బీ కింద జేబీఎ్స-మేడ్చల్, జేబీఎ్స-శామీర్పేట్, ఎయిర్పోర్ట్- ఫ్యూచర్సిటీని రూపొందించాలని హెచ్ఏఎంఎల్ అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. ఈ క్రమంలో పార్ట్-ఏ డీపీఆర్ను రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో గతేడాది నవంబర్-4న కేంద్రానికి పంపించగా.. తాజాగా పార్ట్-బీకి సంబంధించిన మూడు కారిడార్ల డీపీఆర్ను హెచ్ఏఎంఎల్ బోర్డు ఆమోదంతో 8న రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది.
కిలోమీటరుకు రూ.227.39 కోట్లు..!
పార్ట్-బీ కింద జేబీఎస్ మెట్రో స్టేషన్- మేడ్చల్ (24.5 కిలోమీటర్లు), జేబీఎస్ మెట్రో స్టేషన్-శామీర్పేట్ (22 కిలోమీటర్లు) ప్రతిపాదించారు. అలాగే శంషాబాద్ ఎయిర్పోర్టు-ఫ్యూచర్సిటీ (స్కిల్ యూనివర్సిటీ) 39.6 కిలోమీటర్లు చేపడుతున్నారు. అయితే పార్ట్-ఏలో కిలోమీటరుకు సుమారు రూ.318కోట్లతో అంచనాతో డీపీఆర్ను తయారు చేయగా.. పార్ట్-బీలో కిలోమీటరుకు రూ.227.39 కోట్లతోనే రూపొందించినట్లు తెలుస్తోంది. పార్ట్-బీలోని ఫ్యూచర్సిటీ మార్గంలో భూసేకరణ సమస్య పెద్దగా లేకపోవడంతో ఖర్చు తగ్గిన పరిస్థితి కనిపిస్తోంది.. కాగా, జేబీఎ్స-మేడ్చల్, జేబీఎ్స-శామీర్పేట్లో ఖర్చు పెరుగు తోందని అధికారులు తెలిపారు. మొత్తం మూడు కారిడార్లకు రూ.19,579 కోట్లు అవసరం పడుతున్నట్లు డీపీఆర్లో పేర్కొన్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా, రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తర్వాత డీపీఆర్ను కేంద్రానికి పంపించనున్నట్లు హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. జేబీఎ్స-మేడ్చల్లో 24.5 కిలోమీటర్ల మార్గం పూర్తి ఎలివేటెడ్ కారిడార్ (ఆకాశమార్గం)లో నిర్మాణం జరుగుతోందన్నారు. కాగా, జేబీఎ్స-శామీర్పేట్ 22 కిలోమీటర్ల కారిడార్లో 20.35 కిలోమీటర్ల వరకు ఎలివేటెడ్, 1.65 కిలోమీటర్లు భూగర్భంలో ఉంటుందని చెప్పారు. హకీంపేట విమానాశ్రయం సమీపంలో భూగర్భ మార్గంలో ట్రాక్ చేపడుతామన్నారు. కాగా, శంషాబాద్ ఎయిర్పోర్టు- ఫ్యూచర్ సిటీ (స్కిల్ యూనివర్సిటీ) 39.6 కిలోమీటర్లలో ఎయిర్పోర్డు నుంచి 1.5 కి.మీ భూగర్భ మార్గంలో, 21 కిలోమీటర్లు ఎలివేటెడ్ (ఆకాశ మార్గంలో), 17 కిలోమీటర్లు ఎట్ గ్రేడ్ (భూమిపై) ట్రాక్ ఉంటుందన్నారు. మొత్తం 86.1 కిలోమీటర్లతో పార్ట్-బీ డీపీఆర్ను తయారు చేసినట్లు పేర్కొన్కారు.
ఇవి కూడా చదవండి
Vijayawada Durgamma: దుర్గగుడిలో భక్తుల రద్దీ.. కీలక నిర్ణయం తీసుకున్న EO
Husband And Wife: సెల్ఫోన్లో పాటలు.. సౌండ్ తగ్గించమన్నందుకు భార్యపై దారుణం..