Alcohol Sales: ఎక్సైజ్ శాఖకు.. ఒక్క నెలలోనే భారీగా ఆదాయం..
ABN , Publish Date - Nov 06 , 2025 | 02:33 AM
రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు ఒక్క నెలలోనే భారీగా ఆదాయం సమకూరింది. ఏకంగా రూ.6,348 కోట్లు ప్రభుత్వ ఖజానాలో జమ అయ్యాయి...
ఒక్క నెలలోనే రూ.6,348 కోట్ల ఆదాయం
మద్యం అమ్మకాలతో అక్టోబరులో రూ.3,168 కోట్లు
కొత్త దరఖాస్తులు, లైసెన్స్ ఫీజుల ద్వారా 3,180 కోట్లు
ప్రభుత్వ ఖజానాకు భారీ ఉపశమనం
హైదరాబాద్, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు ఒక్క నెలలోనే భారీగా ఆదాయం సమకూరింది. ఏకంగా రూ.6,348 కోట్లు ప్రభుత్వ ఖజానాలో జమ అయ్యాయి. కొత్త మద్యం పాలసీలో భాగంగా అందిన దరఖాస్తుల ఫీజులు, లైసెన్స్ ఫీజుల రూపంలో ఏకంగా రూ.3,180 కోట్లకుపైగా ఆదాయం వచ్చింది. అక్టోబరు నెలలో వరుస పండుగలు రావడంతో మద్యం అమ్మకాల ద్వారా రికార్డు స్థాయిలో రూ.3,168 కోట్ల ఆదాయం సమకూరింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రెట్టింపు స్థాయిలో ఆదాయం రావడం ఎక్సైజ్ శాఖ అధికారులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. రాష్ట్రంలోని 2,620 మద్యం దుకాణాలకు రెండేళ్ల కాలపరిమితికి కొత్త లైసెన్సులు ఇచ్చేందుకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. కొత్త పాలసీలో మద్యం దుకాణాల దరఖాస్తు ఫీజును రూ.2లక్షల నుంచి రూ.3లక్షలకు పెంచింది. రెండేళ్ల క్రితం 1.32లక్షల మంది దరఖాస్తు చేయగా.. రూ.2,645 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ సారి దరఖాస్తు ఫీజు పెంచినప్పటికీ మద్యం దుకాణాలను దక్కించుకోవడానికి 95,628 మంది పోటీపడ్డారు. ఫలితంగా కేవలం దరఖాస్తుల విక్రయం ద్వారానే ఎక్సైజ్ శాఖకు రూ.2,868.8 కోట్ల ఆదాయం వచ్చింది. లాటరీలో మద్యం షాపులను దక్కించుకున్న వ్యాపారులు మొదటి విడతలో లైసెన్స్ ఫీజులో ఆరో వంతు మొత్తాన్ని అడ్వాన్స్గా చెల్లించడంతో అదనంగా మరో రూ.313 కోట్లు ప్రభుత్వ ఖజానాలో జమ అయ్యాయి. మరోవైపు.. అక్టోబరు నెలలో పండుగలు, జాతరల కారణంగా మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. గత ఏడాది అక్టోబరులో మద్యం అమ్మకాల ద్వారా రూ.2,987కోట్ల ఆదాయం రాగా.. ఈ సారి రూ.3,168 కోట్ల ఆదాయం వచ్చింది. దీంతో మొత్తం ఆదాయం నెల రోజుల్లోనే రూ.6,348 కోట్ల మార్కును దాటింది. ఎక్సైజ్శాఖకు భారీగా ఆదాయం వచ్చిన నేపథ్యంలో పెండింగ్ బిల్లులు మంజూరవుతాయని మద్యం సరఫరాదారులు, కాంట్రాక్టర్లు ఆశిస్తున్నారు. ఏదేమైనా భారీ ఆదాయంతో ప్రభుత్వ ఖజానాకు ఉపశమనం కలిగింది.