Share News

Agriculture Thrives with Record Growth: రైతన్నా.. ముందుకు సాగు

ABN , Publish Date - Dec 03 , 2025 | 03:36 AM

సుస్థిర పాలన, రైతులకు లాభం చేకూర్చే విధానాలు, విస్తరణ ఫలితాలతో రాష్ట్రంలో వ్యవసాయం ఏటేటా వర్ధిల్లుతోందని, గత రెండేళ్లలో తెలంగాణ దేశం దృష్టిని ఆకర్షించేలా పంటలసాగులో సరికొత్త రికార్డులు....

Agriculture Thrives with Record Growth: రైతన్నా.. ముందుకు సాగు

  • రెండేళ్లుగా స్థిరంగా వ్యవసాయరంగం అభివృద్ధి

  • రైతుల సంక్షేమానికి రూ.లక్ష కోట్లకు పైగా నిధులు

హైదరాబాద్‌, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): సుస్థిర పాలన, రైతులకు లాభం చేకూర్చే విధానాలు, విస్తరణ ఫలితాలతో రాష్ట్రంలో వ్యవసాయం ఏటేటా వర్ధిల్లుతోందని, గత రెండేళ్లలో తెలంగాణ దేశం దృష్టిని ఆకర్షించేలా పంటలసాగులో సరికొత్త రికార్డులు నెలకొల్పిందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. వరిసాగు విస్తీర్ణం, దిగుబడిలో పంజాబ్‌ను దాటేసిందని, రాష్ట్ర స్థూల ఉత్పత్తి విలువలో వ్యవసాయం వాటా 6.7 శాతం పెరిగిందని, ప్రస్తుత ధరల ప్రకారం వ్యవసాయరంగం వాటా గత ఏడాది రూ. 1,00,004 కోట్లు నమోదుకాగా... 2024-25 అంచనాల ప్రకారం రూ. 1,06,708 కోట్లకు చేరిందని పేర్కొంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా మంగళవారం ‘అగ్రికల్చర్‌ రైజింగ్‌’ పేరుతో ప్రకటన వెలువరించింది. సర్కారు అందిస్తున్న ప్రోత్సాహంతో రాష్ట్రంలో పంటల సాగువిస్తీర్ణం పెరిగిందని, రైతులకు ఆర్థిక భద్రత చేకూరిందని ఆ నివేదికలో పేర్కొంది. 2023-24 సీజన్‌లో 209.62 లక్షల ఎకరాల్లో అన్ని పంటలు సాగుచేయగా 296.17 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వచ్చింది. 2024-25 సీజన్‌లో సాగువిస్తీర్ణం ఏకంగా 220.77 లక్షల ఎకరాలకు పెరిగింది. దిగుబడి 320.62 లక్షల మెట్రిక్‌ టన్నులకు చేరినట్లు ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణలో ప్రధాన పంటైన వరి 2023-24లో 118.11 లక్ష్లల ఎకరాల్లో సాగుచేయగా 2024- 25లో 127.03 లక్షల ఎకరాలకు పెరిగిందని, ధాన్యం దిగుబడి 260.88 లక్షల మెట్రిక్‌ టన్నుల నుంచి.. ఈ ఏడాది వానాకాలం, యాసంగిలో కలిపి 284.16 లక్షల మెట్రిక్‌ టన్నులకు పెరిగిందని, ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలో అగ్రగామిగా నిలిచిందని ప్రభుత్వం పేర్కొంది. పత్తి సాగువిస్తీర్ణం ఇంచుమించుగా రెండేళ్లు ఒకే తీరుగా ఉంది. నిరుటితో పోలిస్తే ఈఏడాది పత్తి ఉత్పత్తి 3.89 లక్షల టన్ను లు పెరిగిందని, 26.35 లక్షల టన్నుల నుంచి 30.24 లక్షల టన్నులకు చేరిందని వెల్లడించింది. తొలి రెండేళ్లలోనే ప్రజా ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చింది. రైతుల మేలుకోరే పథకాలకు భారీ బడ్జెట్‌ కేటాయించింది. తెలంగాణ రైతులను దేశానికే ఆదర్శంగా నిలబెట్టాలనే సంకల్పంతో లక్ష కోట్లకుపైగా ఖర్చుచేసిందని, రూ. 54,280 కోట్లతో వివిధ పథకాలను అమలు చేసిందని, దేశంలోనే వరిసాగు విస్తీర్ణంలో తెలంగాణ నం.1 స్థానాన్ని నిలబెట్టుకున్నదని, 66.77 లక్షల ఎకరాల్లో వరి సాగుచేయగా గతంలో ఎన్నడూ లేనివిధంగా 153 లక్షల టన్నుల దిగుబడి వచ్చిందని ప్రభుత్వం వెల్లడించింది. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులకు ఒకేసారి రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేసిందని, 25 లక్షల (25,35,964) రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేసిందని, తొలి ఏడాదిలోనే రూ. 20,616 కోట్ల రుణాలను మాఫీచేసిందని వెల్లడించింది. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి అమల్లోకి తెచ్చిన వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు పథకాన్ని నిరాటంకంగా ప్రజా ప్రభుత్వం కొనసాగిస్తోందని, రైతులకిచ్చే ఉచిత విద్యుత్తుకు ప్రతి ఏడాది దాదాపు రూ. 10,444 కోట్లు సబ్సిడీగా చెల్లించినట్లు వెల్లడించింది.


గత ప్రభుత్వ హయంలో రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ధరణి వెబ్‌ పోర్టల్‌ రద్దు చేసి.. రైతులకు తమ భూములపై హక్కులు కల్పించేందుకు భూభారతి చట్టం అమల్లోకి తెచ్చింది. భూభారతి కొత్త పోర్టల్తో భూముల సమస్యలు, వివాదాలు చాలావరకకు పరిష్కారమయ్యాయని పేర్కొంది. రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించేందుకు, అధికారులు నేరుగా క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడి పరిస్థితులు తెలుసుకునేందుకు రైతునేస్తం పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. రాష్ట్రమంతటా 1,600 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్‌ యూనిట్లను అమర్చినట్లు వెల్లడించింది. అన్ని మండలాల్లో వ్యవసాయ అధికారులు ఉండేలా టీజీపీఎస్సీ ద్వారా 144 మంది వ్యవసాయ అధికారుల నియామకాలు చేపట్టింది. ఉద్యాన శాఖలో 18 మంది హార్టికల్చర్‌ ఆఫీసర్లను నియమించినట్లు వెల్లడించింది. ఆయిల్‌ పామ్‌ దిగుమతి సుంకం సంబంధించిన సమస్యలు పరిష్కరించటం ద్వారా ఆయిల్‌ పామ్‌ రైతులకు టన్నుకు రూ.2వేలు అదనపు లబ్థి చేకూరే నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ రంగం అభివృద్థి సలహాలు, సూచనల కోసం కోదండరెడ్డి సారఽథ్యంలో వ్యవసాయ కమిషన్‌ ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. కాగా రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించేందుకు ప్రత్యేకంగా తెలంగాణ విత్తన చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. మే నెలలోనే ఈ బిల్లు ముసాయిదా తయారీకి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. మెరుగైన విత్తనాలను పండించడం, స్థానికంగా అవసరం మేరకు వాడుకొని, మిగిలిన వాటిని ఎగుమతిచేసే స్థాయికి రైతులు ఎదిగేలా ఈ చట్టం ఉపయోగపడుతుందని ప్రభుత్వం వెల్లడించింది. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వెనుకాడలేదని, గత ఏడాది మార్చి, సెప్టెంబరు నెలల్లో వడగండ్లు, వర్షాలతో నష్టపోయిన 9,4462 మంది రైతులకు రూ. 95.39 కోట్ల పరిహారం అందించినట్లు వెల్లడించింది. ఇటీవల మార్చి, ఏప్రిల్లో వచ్చిన భారీ వర్షాలకు నష్టపోయిన 36,449 మంది రైతులకు రూ. 44.19 కోట్ల పరిహారం అందించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.


ఎక్కువ కొనుగోలు కేంద్రాలు

గత ప్రభుత్వం నిలిపేసిన 16 కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించిందని, రైతులు దళారుల చేతిలో మోసపోకుండా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు చేపడుతోందని, గతం లో కంటే ఎక్కువ కొనుగోలు కేంద్రాలు నెలకొల్పిందని, రైతులు నెలలకొద్దీ ఎదురు చూడకుండా డబ్బులను వేగంగా చెల్లించి రికార్డు నెలకొల్పిందని ప్రభు త్వం పేర్కొంది. ప్రస్తుత సీజన్లో 8,380 కేంద్రాలు ఏర్పాటుచేసి ఇప్పటికే 38.72 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందని, ఇప్పటివరకు (డిసెంబరు 2వ తేదీ) రూ. 10,162 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేసిందని, రైతులకు రెండు రోజుల్లోనే డబ్బులు చెల్లిస్తున్నట్లు తెలిపింది. రైతులకిచ్చిన మాట ప్రకారం సన్న వడ్లకు రూ. 500 బోనస్‌ ప్రకటించిందని, రైతులకు మద్దతు ధరకు అదనంగా బోనస్‌ చెల్లించిందని, దీంతో సన్నరకాల వరిసాగు విస్తీర్ణం పెరిగిందని, సీజన్లో ఇప్పటికే సన్నాలు అమ్మిన రైతులకు రూ.314 కోట్ల బోనస్‌ చెల్లించినట్లు వెల్లడించింది.

భరోసా పంపిణీలో రికార్డు వేగం

‘‘ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రలో రైతులకు పంటల పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా పంపిణీలోనూ రికార్డు వేగం నమోదు చేసింది. ఎకరానికి రూ.12 వేల చొప్పున రాష్ట్రలోని రైతులందరికీ రైతుభరోసా నిధులు పంపిణీ చేసింది. మొత్తం 1,57,51,000 ఎకరాలకు 69,86,548 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో ఈ నిధులు జమ చేసింది. ఈ ఏడాది వానాకాలం పంటలకు రికార్డు వేగంతో రైతు భరోసా నిధులు పంపిణీ చేసింది. గతంలో ఎన్నడూ లేనంత వేగంగా కేవలం తొమ్మిది రోజుల్లోనే రూ. 8,744 కోట్లు జమ చేసింది.’’ అని ప్రభుత్వం నివేదికలో వెల్లడించింది. ‘‘రైతుకు ఆపదొస్తే రైతు కుటుంబాలు ధీమాగా ఉండేలా రైతు బీమాను అమలు చేస్తోంది. రైతులు ఏ కారణంతో మరణించినా రూ. 5 లక్షల బీమా పరిహారం బాధిత కుటుంబానికి అందిస్తోంది. 42.16 లక్షల మంది రైతుల కుటుంబాల పేరిట ప్రభుత్వం జీవిత బీమా కంపెనీకి రైతు బీమా ప్రీమియం చెల్లించింది. గతంలో ఒక్కో రైతుకు రూ. 3,400 చొప్పున చెల్లించిన ప్రీమియంను ప్రభుత్వం ఎల్‌ఐసీతో సంప్రదింపులుచేసి ఈసారి రూ. 3,225కు తగ్గించింది.’’ అని వివరించింది.

Updated Date - Dec 03 , 2025 | 03:36 AM