kumaram bheem asifabad- మొదటి విడత ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
ABN , Publish Date - Dec 07 , 2025 | 11:01 PM
రెండో సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 11న మొదటి విడత సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు జరగనున్న ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. కలెక్టరేట్ క్యాంపు కార్యాలయంల నుంచి మొదటి విడత పోలింగ్ నిర్వహించే లింగాపూర్, సిర్పూర్(యూ), జైనూరు, కెరమెరి, వాంకిడి మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, ఎంపీవోలు, జోనల్ అధికారులతో ఆదివారం జూమ్ మీటింగ్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఆసిఫాబాద్, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): రెండో సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 11న మొదటి విడత సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు జరగనున్న ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. కలెక్టరేట్ క్యాంపు కార్యాలయంల నుంచి మొదటి విడత పోలింగ్ నిర్వహించే లింగాపూర్, సిర్పూర్(యూ), జైనూరు, కెరమెరి, వాంకిడి మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, ఎంపీవోలు, జోనల్ అధికారులతో ఆదివారం జూమ్ మీటింగ్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొదటి విడతలో భాగంగా ఈ నెల 11న నిర్వహించే సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. పోలింగ్ కేంద్రాలో అన్ని ఏర్పాట్లు చేయాలని, సరిపడా కుర్చీలు, టేబుళ్లు, వెలుతురు సరిగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పోలింగ్ సిబ్బంది ముందు రోజు సాయం త్రం 4 గంటలకు అన్ని పోలింగ్ కేంద్రాలకు చేరుకునేలా అధికారులు పర్యవేక్షించాలని అన్నారు. ఎన్నికల్లో ఉపయోగించే సామగ్రి, కవర్లు, పేపర్లు అన్ని అందుబాటులో ఉండేలా చూసుకోవాలని తెలిపారు. బ్యాలెట్ పత్రాలను సరి చూసుకోవాలని, ఎన్నికల సామగ్రి పంపిణీకి కేంద్రంలో బ్యాలెట్ పత్రాలను భద్రపరిచే స్ట్రాంగ్ రూం వద్ద బందో బస్తు ఏరాపట్లు చేయాలని చెప్పారు. సామాగ్రి పంపిణీ కేంద్రం వద్ద కౌంటర్లు ఏరాపటు చేసి రద్దీ లేకుండా చూసుకోవాలని తెలిపారు. సందేహాల నివృత్తి కోసం పంపిణీ కేంద్రాల్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని సూచించారు. పోలింగ్ సిబ్బందికి తాగునీరు, అల్పాహారం, భోజన సమయానికి అందించాలని, జోనల్ అధికారులు తమ రూట్ పరిధిలోని ప్రతి పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించాలని తెలిపారు. స్టేజ్-2 ఆర్వోలకు మరో సారి శిక్షణ ఇవ్వాలని, పీవో, ఓపీవోలకు ఈ నెల 9 తేదీన ఎన్నికలకు జరిగే మండల కేంద్రాలలో ఎన్నికల నిర్వహణపై శిక్షణ అందించాలని సూచించారు. ఈ నెల 10న ఉదయం 9 గంటలకు పోలింగ్ సిబ్బందికి సామగ్రి పంపిణీ కేంద్రానికి చేరుకొని రిపోర్టు చేసేలా చూడాలని, రూట్ల వారీగా అవసరమైన వాహనాలను సిద్ధం చేసుకోవాలన్నారు. పూర్తి బందో బస్తు మధ్య ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంతంగా చేపట్టేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్రావు, డీపీవో భిక్షపతిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.