Telangana State Election Commission: స్థానిక ఎన్నికలకు ఎస్ఈసీ సిద్ధం!
ABN , Publish Date - Sep 27 , 2025 | 04:20 AM
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎ్సఈసీ) సిద్ధమైంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిన...
నేడు వివిధ శాఖల ఉన్నతాధికారులతో భేటీ
ఎన్నికల నిర్వహణపై చర్చ
సోమవారం షెడ్యూల్ ఖరారు?
ఎస్ఈసీతో డీజీపీ భేటీ.. పలు అంశాలపై చర్చ
హైదరాబాద్, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎ్సఈసీ) సిద్ధమైంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిన నేపథ్యంలో తక్షణమే ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని ఎస్ఈసీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు పంచాయతీరాజ్, పోలీసు, విద్య, విద్యుత్తు, ఇతర శాఖల ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లతో ఎస్ఈసీ కమిషనర్ శనివారం సమావేశం కానున్నారు. ఇందులో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని శాఖల సంసిద్ధత, ఇతర అంశాలపై చర్చించనున్నారు. ఎన్నికల నిర్వహణపై స్పష్టత వచ్చిన తర్వాత ఈ నెల 29న (సోమవారం) షెడ్యూల్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదినితో శుక్రవారం డీజీపీ జితేందర్ సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో శాంతిభద్రతల సమస్య సహా జిల్లాల వారీగా పరిస్థితులపై చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురూ చర్చించినట్లు తెలిసింది.స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తిచేసుకున్నట్లు ఎస్ఈసీ విభాగాలు తెలిపాయి. బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేసుకోవడమే కాకుండా ఎన్నికల సిబ్బంది ఎంపిక, శిక్షణ వంటివి పూర్తిచేసినట్లు తెలిపాయి.