Share News

పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

ABN , Publish Date - May 29 , 2025 | 12:46 AM

వర్షాలు కురుస్తున్నందున పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్‌ తేజస్‌నందలాల్‌ పవార్‌ ఆదేశించారు.

పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
కోక్యానాయక్‌తండాలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ తేజస్‌నందలాల్‌ పవార్‌

కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌

సూర్యాపేట(కలెక్టరేట్‌), మే 28 (ఆంధ్రజ్యోతి): వర్షాలు కురుస్తున్నందున పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్‌ తేజస్‌నందలాల్‌ పవార్‌ ఆదేశించారు. అదనపు కలెక్టర్‌ రాంబాబుతో కలిసి వెబెక్స్‌ ద్వారా జిల్లాలోని ఎంపీడీవోలు, గ్రామకార్యదర్శులు, ప్రత్యేకాధికారులతో కలెక్టరేట్‌ నుంచి బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాకు ఇందిరమ్మ ఇళ్లు 12,868గాను మొదటి విడతలో 4,322 మంది లబ్ధిదారులకు మంజూరుచేశామన్నారు. నిర్మాణాలు వివిధదశల్లో ఉన్నాయన్నారు. త్వరగా పూర్త య్యేలా సహకరించాలన్నారు. ప్రతీ సోమవారం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో డబ్బులు జమవుతాయన్నారు. రాజీవ్‌యువ వికాసంలో భాగంగా జిల్లాలో 60,085 దరఖాస్తులకు 57,985 దరఖాస్తులను విచారణ చేసి బ్యాంకులకు పంపినట్లు తెలిపారు. పారిశుధ్య కార్మికులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. సమావేశంలో డీఆర్‌డీవో అప్పారావు, హౌసింగ్‌ పీడీ ధర్మారెడ్డి, జిల్లా సంక్షేమాధికారులు శ్రీనివాసనాయక్‌, జగదీశ్వర్‌రెడ్డి, ఎల్‌డీఎం బాపూజీ, డీపీవో యాదయ్య ఉన్నారు.

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు

సూర్యాపేట(కలెక్టరేట్‌), మే 28 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ తేజ్‌సనందలాల్‌ పవార్‌ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పాత వ్యవసాయ మార్కెట్‌లోని పలు ఫర్టిలైజర్‌ దుకాణాల్లో తనిఖీలు చేశారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ నాణ్యమైన ఎరువులు, విత్తనాలు రైతులకు అందించాలని వ్యవసాయాధికారులకు సూచించారు. వానాకాలం సీజన్‌లో సరిపడా కాంప్లెక్స్‌ ఎరువులు, యూరియా, ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. రైతులు ఏరకం విత్తనాలపై ఆసక్తి చూపిస్తున్నారనే విషయాన్ని దుకాణదారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన డీలర్లు ఈ-పాస్‌ మిషన్‌ ద్వారానే ఎరువులు విక్రయించాలన్నారు. కార్యక్రమంలో డీఏవో శ్రీధర్‌రెడ్డి, ఆర్డీవో వేణుమాధవ్‌, ఏవో గణేష్‌, కృష్ణసందీప్‌ ఉన్నారు.

తిరుమలగిరి రూరల్‌: ప్రభుత్వం నిర్దేశించిన నియమాల ప్రకారమే లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవాలని కలెక్టర్‌ తేజ్‌సనందాలాల్‌ పవార్‌ తెలిపారు. బుధవారం తిరుమలగిరి మండలంలోని కోక్యానాయక్‌తండ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను, ఐకేపీ ధాన్యం కొనుగోలు కేందాన్ని పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్లను 600 చదరపు అడుగుల్లో మాత్రమే నిర్మించుకుంటేనే రూ. 5 లక్షల ప్రభుత్వ ఆర్ధిక సహకారం అందుకోవడానికి అర్హులు అవుతారన్నారు. కోక్యానాయక్‌తండా గ్రామంలోని ఇస్లావత్‌ యాకమ్మ, ఇస్లావత్‌ జగన్‌లు నిర్మిస్తున్న ఇళ్లను పరిశీలించి వారికి పలు సూచనలు చేశారు. అనంతరం ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీవో వేణుమాధవ్‌, సివిల్‌ సప్లై డీఎం ప్రసాద్‌, మండల తహసీల్దారు హరిప్రసాద్‌, ఎపీఎం మధు, కిరణ్‌ పాల్గొన్నారు.

అర్వపల్లి : అర్వపల్లి మండల కేంద్రంలోని మన గ్రోమోర్‌ సెంటర్‌ను కలెక్టర్‌ తేజస్‌నందలాల్‌ పవార్‌ బుధవారం తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. వ్యవసాయాధికారులు పంట సాగుపై రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్‌రెడ్డి, ఆర్డీవో వేణుమాదవ్‌, ఎంపీడీవో గోపి, ఏవో గణేష్‌, కృష్ణ, సందీప్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 30 , 2025 | 03:10 PM