Road Accident: ఓటు వేయడానికి వెళ్తూ అనంతలోకాలకు
ABN , Publish Date - Dec 14 , 2025 | 07:01 AM
రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్తూ వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు.
వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురి దుర్మరణం
మెదక్ జిల్లాలో నలుగురు, జనగామ జిల్లాలో ఇద్దరు యువకుల మృతి
పెద్ద శంకరంపేట్, స్టేషన్ఘన్పూర్, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్తూ వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట శివారు 161 జాతీయ రహదారిపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలం మాగి గ్రామానికి చెందిన కురుమ లింగమయ్య(45), భార్య కురుమ సామప్ప(40) కుమారుడు సాయిలు(18) కూతురు మానస(8) ద్విచక్రవాహనంపై వెళ్తుండగా, గుర్తు తెలియని వాహనం ఢీ కొంది. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. మాగి గ్రామానికి చెందిన దంపతులు కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్కు వెళ్లి అక్కడే పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఓటు వేసేందుకు ద్విచక్రవాహనంపై నగరం నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఓటు వేయడానికి బైక్పై వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందిన ఘటన జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం రాఘవపూర్లో జరిగింది. ఈ ప్రమాదంలో బుర్ర నవీన్ (27), బుర్ర కల్యాణ్ (27) మృత్యువాత పడ్డారు. ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి బైక్పై స్వగ్రామానికి వెళ్తుండగా జాతీయ రహదారిపై డివైడర్ను ఢీకొట్టి తీవ్రంగా గాయపడ్డారు. వీరిని జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించే క్రమంలో ఇద్దరూ మృతి చెందారు. మృతదేహాలను జనగామ ఏరియా ఆస్పత్రిలోని మార్చురికి తరలించారు.