Sale of Fake Seeds: నకిలీ విత్తనాలు అమ్మితే 30 లక్షల దాకా జరిమానా!
ABN , Publish Date - Dec 11 , 2025 | 05:00 AM
నకిలీ విత్తనాలు విక్రయించే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫారసు చేసింది. ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా విత్తనాల విక్రయం....
మూడేళ్ల జైలు సహా విత్తన సంస్థలపై ఐదేళ్ల నిషేధం
విత్తన ధరలను రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించాలి
కేంద్ర విత్తన చట్టం-25 ముసాయిదాకు ప్రతిపాదనలు
రాష్ట్ర ప్రభుత్వ సూచనలు వెల్లడించిన మంత్రి తుమ్మల
హైదరాబాద్, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): నకిలీ విత్తనాలు విక్రయించే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫారసు చేసింది. ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా విత్తనాల విక్రయం, నకిలీ/నాసిరకం విత్తనాలు రైతులకు అంటగట్టడం, లేబుల్స్ లేకుండా సరఫరా చేయడం లాంటి అక్రమాలకు పాల్పడే విత్తనోత్పత్తి సంస్థలకు రూ.50 వేల నుంచి 30 లక్షల వరకు జరిమానా విధించాలని సూచించింది. విత్తనచట్టం-2025 ముసాయిదాపై నెల రోజులపాటు వివిధ వర్గాలతో చర్చించిన రాష్ట్ర వ్యవసాయశాఖ.. పలు సూచనలతో తుది నివేదికను సిద్ధం చేసింది. అభ్యంతరాలు తెలపడానికి గురువారంతో గడువు ముగుస్తోంది. ఈ క్రమంలో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతుల ప్రయోజనాల కోసం ముసాయిదాలో చేర్చాల్సిన, మార్చాల్సిన అంశాలను తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ సూచనలు
ప్రత్యేకమైన రకాలను నమోదు చేయడానికి రాష్ట్ర విత్తన కమిటీకి, రాష్ట్రానికి అధికారం ఇవ్వాలి. ఎందుకంటే స్థానిక రైతులకు ఎలాంటి విత్తనాలు కావాలి? వారి అవసరాలేంటి? వాతావరణం ఎలా ఉంటుంది? అనే వివరాలు రాష్ట్ర ప్రభుత్వం వద్దే ఉంటాయి.
ప్రతి విత్తనోత్పత్తి సంస్థ నిర్వాహకుడు, విత్తన డీలర్లు, పంపిణీదారులుకనీస విద్యార్హతగా వ్యవసాయంలో డిగ్రీ/డిప్లొమా కలిగి ఉండాలి. లేదంటే ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలో 3 నెలల సర్టిఫికెట్ కోర్సు పూర్తిచేసి ఉండాలి.
అన్నిరకాల విత్తనాలను గుర్తింపు పొందిన సంస్థతో ధ్రువీకరించాలి. స్వీయ ధ్రువీకరణకు అనుమతి ఇవ్వకూడదు.
రైతుల నుంచి ఫిర్యాదులు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు విత్తన ధరలను నియంత్రించే అధికారం కల్పించాలి.
దిగుమతి చేసుకున్న విత్తనాలన్నింటికీ కనీసం రెండేళ్లు.. ఐసీఏఆర్, ఎస్ఏయూ కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించి, విజయవంతమైన తర్వాతే ఇక్కడి రైతులకు మార్కెటింగ్ చేయాలి.
రైతులు, రైతు సంఘాల సూచనలు
నకిలీ/నాసిరకం విత్తనాలతో నష్టపోయిన రైతులకు 60రోజుల్లోగా పరిహారం అందించాలి. అత్యధిక దిగుబడి ఆధారంగానే పరిహారాన్ని లెక్కించాలి. విత్తనాలను సరసమైన ధరల్లో రైతులకు అమ్మడానికి విత్తన ధరల నియంత్రణ తప్పనిసరిగా ఉండాలి.
సంప్రదాయ విత్తనాలు, వారసత్వ విత్తనాలు, డిజిటల్ సీక్వెన్స్ ఇన్ఫర్మేషన్ (డీఎ్సఐ)ను రక్షించడానికి ప్రత్యేక చర్యలు ఉండాలి.
రాష్ట్ర ప్రతిపాదనలను బిల్లులో చేర్చాలి: తుమ్మల
‘‘విత్తన చట్టంపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను కేంద్రం పరిగణనలోకి తీసుకొని విత్తన బిల్లులో చేర్చాలి. నకిలీ, నాసిరకం విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రైతుల ప్రయోజనాలను పరిరక్షించేలా చట్టాలు లేకపోవడంతో నష్టపోతున్నారు. ఈ క్రమంలో కఠినమైన చట్టాలను రూపొందించాల్సిన అవసరం ఉంది’’ అని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.