Nellore Highway Crash: టిప్పర్ బీభత్సం
ABN , Publish Date - Sep 18 , 2025 | 05:26 AM
ఆస్పత్రిలో ఉన్న బంధువును పరామర్శించేందుకు కారులో బయలుదేరిన వాళ్లంతా విగతజీవులుగా మారి అదే ఆస్పత్రికి చేరుకున్నారు. మరో 15, 20 నిమిషాల్లో గమ్యస్థానం చేరతారనగా...
మితిమీరిన వేగంతో రాంగ్రూట్లోకి దూసుకొచ్చి కారును ఢీకొట్టిన టిప్పర్
కారులోని ఏడుగురూ మృత్యువాత
నెల్లూరు జిల్లా సంగం వద్ద ప్రమాదం
సంగం, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ఆస్పత్రిలో ఉన్న బంధువును పరామర్శించేందుకు కారులో బయలుదేరిన వాళ్లంతా విగతజీవులుగా మారి అదే ఆస్పత్రికి చేరుకున్నారు. మరో 15, 20 నిమిషాల్లో గమ్యస్థానం చేరతారనగా...మృత్యువులా దూసుకొచ్చిన టిప్పర్ వారి కారును ఢీకొట్టింది. ఈఘటనలో కారులోని ఏడుగురూ మాంసంముద్దల్లా మారగా, వారు ప్రయాణిస్తున్న కారు నుజ్జునుజ్జయింది. నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన వద్ద ముంబై జాతీయరహదారిపై బుధవారం మధ్యాహ్నం ఈ ఘోరం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే...నెల్లూరు సిటీలో తాళ్లూరు శ్రీనివాసులు (40) అనే వ్యక్తి తన భార్య రాధమ్మతో (38) కలిసి ఫాస్ట్పుడ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. రాధమ్మ బంధువు ఒకరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకుని వారు... తమ బంధువులు శేషం సారమ్మ (40) బాలవెంగయ్య దంపతులు, చల్లగుండ్ల శ్రీనివాసులు, లక్ష్మి (35) దంపతులతో కలిసి కారులో బయలుదేరారు. తమ వద్ద పనిచేసే బ్రహ్మయ్య అనే వ్యక్తిని కారు డ్రైవింగ్ తెలిసి ఉండటంతో కారు ఎక్కించుకున్నారు. ఇలా ఏడుగురు బుధవారం ఉదయం 10.30గంటలకు బయలుదేరారు. నెల్లూరు దాటి ముంబై హైవే మీదుగా ఆత్మకూరు దిశగా వెళుతూ.. సంగం కొండ దిగి పెరమన సమీపానికి వచ్చింది. ఇంతలో రాంగ్రూట్లో అతివేగంగా వచ్చిన ఇసుక టిప్పర్.. వీరి కారును ఢీకొంది. ఆ వేగం ధాటికి కారు ముందు భాగం నుజ్జునుజ్జయి 20 మీటర్ల వెనక్కి వచ్చి ఆగింది. అందులోని ఏడుగురూ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. వారి మృతదేహాలు గుర్తుపట్టలేనివిధంగా రక్తపు ముద్దగా మారిపోయాయి.. టిప్పర్ డ్రైవర్ ప్రసాద్రెడ్డి అక్కడ నుంచి పరారై సంగం పోలీ్సస్టేషన్లో లొంగిపోయాడు. ప్రమాద సమయంలో అతడు మద్యం మత్తులో ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. టిప్పర్ ఇసుక లోడుతో ఆత్మకూరు నుంచి సంగం వైపు వెళుతుండగా, కారు ఆత్మకూరు వైపు పోతోంది. అది రెండు లేన్ల హైవే...మధ్యలో డివైడరు లేదు. అప్పటివరకు ఎడమ వైపు సవ్యంగానే వెళుతున్న టిప్పర్ ఒక్కసారిగా బాగా కుడి వైపునకు వచ్చి కారును ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. టిప్పర్ ఢీకొట్టిన ధాటికి కారు ముందుభాగం నుజ్జునుజ్జయి టిప్పర్ బంపర్ కిందకు దూసుకుపోయింది. కారు ఇంజన్తోపాటు ముందుభాగం వెనుక సీటు వరకు నుజ్జునుజ్జయ్యింది. కారు డోర్లు తెరుచుకోకపోవడంతో మృతదేహాలను వెలికి తీయడం కష్టమైంది. పోలీసులు రెండు క్రేన్లు, ఒక జేసీబీని రప్పించి ఒకదానికొకటి ఇరుక్కున్న కారు, టిప్పర్ను ఎట్టకేలకు వేరుచేశారు. ఇందుకు మూడు గంటలు పడితే, మృతదేహాలను తీసేందుకు మరో గంట సమయం పట్టింది. అనంతరం వాటిని ఆత్మకూరు వైద్యశాలకు తరలించారు.