Telangana DGP: లొంగిపోండి.. ఏమీ చేయం
ABN , Publish Date - Oct 11 , 2025 | 02:52 AM
ఆయుధాలను వదిలి, జనజీవన స్రవంతిలోకి రావడానికి ఇష్టపడే మావోయిస్టులకు అడవుల నుంచి సేఫ్ పాసేజ్ ఇస్తామని.. వారికి ఎలాంటి హాని కల్పించబోమ....
జనజీవన స్రవంతిలోకి వచ్చే మావోయిస్టులకు సేఫ్ పాసేజ్ ఇస్తాం: డీజీపీ
లొంగిపోయిన నక్సల్స్ నేతలు
హైదరాబాద్, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): ఆయుధాలను వదిలి, జనజీవన స్రవంతిలోకి రావడానికి ఇష్టపడే మావోయిస్టులకు అడవుల నుంచి సేఫ్ పాసేజ్ ఇస్తామని.. వారికి ఎలాంటి హాని కల్పించబోమని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు, మీడియా, రాజకీయ నాయకు లు, బంధుమిత్రుల్లో ఎవరి ద్వారానైనా సరే.. లొంగుబాటు సమాచారం అందిస్తే చాలని ఆయన పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీకి చెందిన ముగ్గురు రాష్ట్ర కమిటీ నాయకులు శుక్రవారం డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. వారి వివరాలను డీజీపీ శుక్రవారం తన కార్యాలయంలో వెల్లడించారు. ఆ ముగ్గురూ సిద్దిపేట జిల్లా మద్దూర్ మండలం కూటిగల్ గ్రామానికి చెందిన కుంకటి వెంకటయ్య అలియాస్ రమేశ్ అలియాస్ వికాస్, హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామానికి చెందిన మొగిలిచెర్ల వెంకటరాజు అలియాస్ పున్నంచంద్, ఆయన భార్య తొడెం గంగ. కంటి చూపు మందగించడంతో పాటు పార్టీలో వివిధ విభాగాల్లో వచ్చిన సిద్ధాంతపరమైన విభేదాలతో పున్నంచంద్ భార్యతో కలిసి లొంగిపోవడానికి వచ్చారని.. ఈ ముగ్గురికీ ఒకొక్కరికి రూ.20 లక్షల చొప్పున రివార్డు ను అందజేస్తున్నట్లు ఆయన వివరించారు. ప్రస్తు తం మావోయిస్టు పార్టీలో తెలంగాణ కమిటీలకు సంబంఽధించి 72 మంది అడవుల్లో ఉన్నారని.. కేంద్ర కమిటీలోని 12 మందిలో 8 మంది తెలంగాణ వాసులేనని తెలిపారు. మావోయిస్టు పార్టీలో సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నట్లు లొంగిపోయిన వారు చెపుతున్న విషయాలను బట్టి స్పష్టమవుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ కుమార్, ఎస్ఐబీ చీఫ్ సుమతి, అదనపు డీజీ స్వాతి లక్రా తదితరులు పాల్గొన్నారు.
ఇప్పుడు బయటపడ్డా..
లొంగుబాట్లు, ఆయుధాలను వదిలి వేయడానికి సంబంధించి మావోయిస్టు పార్టీలో భిన్నాభిప్రాయాలున్న విషయం సోనూ లేఖ ద్వారా బయటపడినప్పటికీ.. వాటిపై పార్టీలో చాలాకాలంగా సుదీర్ఘ చర్చ జరుగుతోందని లొంగిపోయిన మావోయిస్టు వికాస్ పేర్కొన్నారు. రాజకీయంగా, సామాజికంగా వస్తున్న మార్పులపై పార్టీలో ఎంతోకాలంగా అంతర్మథనం జరుగుతోందని, ఆయుధాలను వదిలి వేసే విషయం కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదని తెలిపారు. పార్టీ లో పాత పరిస్థితులు, ఉద్యమ వాతావరణం ఇప్పు డు లేవని, పాత విధానాలు ఇప్పుడు పనిచేయవనే విషయమై తీవ్ర చర్చ పార్టీలో జరిగిందని చెప్పారు.