Thummala Nageshwar Rao: రైతు భరోసాకు మరో రూ.459.47 కోట్లు
ABN , Publish Date - Jun 25 , 2025 | 04:44 AM
వానాకాలం రైతు భరోసాలో భాగంగా 15 ఎకరాలకుపైగా ఉన్న రైతులందరి ఖాతాల్లోకి ఎకరాకు రూ.6 వేల చొప్పున మంగళవారం జమ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు.
15 ఎకరాలకుపైగా ఉన్న రైతులందరి ఖాతాల్లోకి జమ: తుమ్మల
హైదరాబాద్, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): వానాకాలం రైతు భరోసాలో భాగంగా 15 ఎకరాలకుపైగా ఉన్న రైతులందరి ఖాతాల్లోకి ఎకరాకు రూ.6 వేల చొప్పున మంగళవారం జమ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. అందుకోసం మరో రూ. 459.47 కోట్లు విడుదల చేశామన్నారు. ఇప్పటి వరకు మొత్తంగా 69.40 లక్షల మంది రైతులకు సంబంధించిన కోటి 46 లక్షల ఎకరాలకుగాను రూ. 8744.13 కోట్లు రైతు భరోసా నిధులు జమ చేశామని పేర్కొన్నారు. రైతు విత్తనం పెట్టే రోజునాటికే వారి జేబుల్లో డబ్బు ఉండేలా చర్యలు తీసుకున్నామని మంత్రి తుమ్మల ఒక ప్రకటనలో తెలిపారు. తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్లు వేస్తామంటే అందరు అపహాస్యం చేశారని, కానీ సాధ్యం చేసి చూపించామన్నారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలు సైతం రాష్ట్రంలో జరుగుతున్న రైతు భరోసాను అభినందిస్తున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి సంక్షేమం దిశగా, విధ్వంసం నుంచి వికాసం దిశగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నామన్నారు.