పరిశోధనకు పెద్దపీట వేయాలి
ABN , Publish Date - Jul 23 , 2025 | 12:25 AM
స్వయంప్రతిపత్తి కళాశాలలు పరిశోధనకు పెద్దపీట వేయాలని, అధ్యాపకులు, విద్యార్థులు బాధ్యతతో మెలగాలని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు.
నల్లగొండ టౌన్, జూలై 22(ఆంధ్రజ్యోతి): స్వయంప్రతిపత్తి కళాశాలలు పరిశోధనకు పెద్దపీట వేయాలని, అధ్యాపకులు, విద్యార్థులు బాధ్యతతో మెలగాలని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. మంగళ వారం నల్లగొండ జిల్లాకేంద్రంలో జరిగిన నాగార్జున ప్రభు త్వ కళాశాల స్థాపక దినోత్సవంలో ఆయన మాట్లాడారు. ఎన్జీ కళాశాల 69 సంవత్సరాలు పూర్తి చేసుకొని 70వ వసంతంలోకి అడుగుపెట్టడం అభినందనీయమన్నారు. నాగార్జున ప్రభుత్వ కళాశాలకు రానున్న కాలంలో నాక్ ‘ఎ’ గ్రేడ్ రావాలని ఆశాభావం వ్యక్తంచేశారు. దీనికి పూర్వ విద్యార్థుల సంఘం కూడా సహకరించాలని సూచించారు. నిధులు సేకరించి కళాశాలను అభివృద్ధి చేయాలన్నారు. అధ్యాపకులు పాఠం చెప్పడంతోనే సరిపెట్టుకోకుండా పరిశోధనలో నిమగ్నం కావాలన్నారు. విద్యార్థుల హాజరు శాతం కేవలం 50 శాతమే ఉండడం శోచనీయన్నారు. కనీసం 75 శాతం హాజరు శాతం ఉన్న విద్యార్థులకే ఉపకారవేతనం, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని తెలంగాణ కళాశాల విద్య ఉన్నతాధికారులకు సూచించారు. విద్యార్థుల భౌతిక, అకాడమిక్ ప్రగతిని ప్రతిరోజూ నమోదు చేయాలన్నారు. నాక్ గుర్తింపుకు అవసరమైన రికార్డులను తయారు చేయాలని అన్నారు. తెలంగాణ కళాశాల విద్య సంయుక్త సంచాలకులు డాక్టర్ డీఎ్సఆర్. రాజేంద్రసింగ్ మాట్లాడుతూ విద్యార్థులు అన్ని ఉద్యోగ అవకాశాలను అంది పుచ్చుకోవాలన్నారు. ప్రతి ఉద్యోగ ప్రకటనను గమనిస్తూ సిద్ధం కావాలన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ ఇక నుంచి ప్రతి ఏటా బంగారు పతకాలు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణాధికారి జి. ఉపేందర్రెడ్డి, తెలంగాణ కళాశాల విద్య విశ్రాంత సంయుక్త సంచాలకులు జి. యాదగిరి, మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస రాజు, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు రాజారాం, నాగార్జున ప్రభుత్వ కళాశాల పూర్వ ప్రిన్సిపాల్ కృష్ణప్రసాద్, విశ్రాంత అధ్యాపకులు లింగయ్య, లక్ష్మయ్య, మీనయ్య, అకాడమిక్ కొఆర్దినేటర్ పరంగి రవికుమార్, వైస్ ప్రిన్సిపాల్ అంతటి శ్రీనివాస్, నాగార్జున పరీక్షల నియంత్రణాదికారి బత్తిని నాగరాజు, అంతర్గత నాణ్యతా ప్రమాణాల సమన్వయ కర్త వైవీ. ఆర్. ప్రసన్నకుమార్, తెలుగు శాఖ అధ్యక్షుడు వెల్దండి శ్రీధర్, అధ్యాపకులు ముని స్వామి, ఎ. మల్లేశం, సుధాకర్, కోటయ్య, శిరీష తదితరులు పాల్గొన్నారు.