kumaram bheem asifabad- వరద నష్టాలపై నివేదికలు సమర్పించాలి
ABN , Publish Date - Aug 29 , 2025 | 11:10 PM
జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా కలిగిన నష్టాలపై పూర్తి వివరాలతో నివేదికలు సమర్పించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ దీపక్ తివారి, సబ్ కలెక్టర్ శ్రద్ధశుక్లాతో కలిసి జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరిగిన నష్టాలపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు
ఆసిఫాబాద్రూరల్, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా కలిగిన నష్టాలపై పూర్తి వివరాలతో నివేదికలు సమర్పించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ దీపక్ తివారి, సబ్ కలెక్టర్ శ్రద్ధశుక్లాతో కలిసి జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరిగిన నష్టాలపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జూలై, ఆగస్టు నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా పంచాయతీ రాజ్, రోడ్డు భవనాల శాఖల పరిధిలోని రహదారులు, వరదనీటి తాకిడికి కోతకు గురైన కల్వర్టులు తెగిపోయినందున వాటి నష్టాల నివేదికలను అందించాలని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల కాలువలు గండ్లు పడ్డాయని, భారీ వర్షాల వల్ల ప్రాథమిక అంచనా ప్రకారం జిల్లాలో 15 వేల ఎకరాలలో వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు. విద్యుత్శాఖ పరిధిలో స్తంభాలు పడిపోవడం, తీగలు తెగి పోవడం, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం, పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో చనిపోయిన పశువులు, మేకలు, గొర్రెల ఫోటోలతో కూడిన వివరాలను వెంటనే అందించాలని అధికారులను ఆదేశించారు. ఇంకా ఇతర శాఖలలో జరిగిన నష్టాలను నివేదిక రూపంలో అందించినట్లయితే బాధితులకు పరిహారం అందించేందుకు నిధులు మంజూరు ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు.
ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు సమర్పించాలి
ఆసిఫాబాద్రూరల్, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఓటర్ల ముసాయిదా జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 30 లోగా సమర్పించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనంలో శుక్రవారం అదనపు కలెక్టర్ దీపక్ తివారి, సబ్ కలెక్టర్ శ్రద్ధశుక్లాలతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో స్థానిక సంస్థల ఓటర్ల జాబితా అభ్యంతరాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా ఓటర్ల జాబితాను ఇప్పటికే సిద్దం చేయడం జరిగిందని, ఓటర్ల ముసాయిదా జాబితాను ఈ నెల 28న అన్ని గ్రామ పంచాయతీలలో, మండల కార్యాలయాల్లో ప్రదర్శించామని చెప్పారు. ఈ నెల 30న అన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారుల కార్యాలయాల్లో రాజ కీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఓటరు జాబితాలోని పేర్లు, పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలు స్వీకరించనున్నామని తతెలలిపారు. ఈ నెల 31న అభ్యంతరాలను పరిష్కరించి సెప్టెంబరు 2న జాబితాను ప్రచురిస్తామని తెలిపారు. జిల్లాలో 3,53,904 మంది ఓటర్లు ఉన్నారని, 335 గ్రామ పంచాయతీలు, 2,874 వార్డులు ఉన్నాయని తెలిపారు. స్థానిక సంస్థల అర్హత గల ఓటర్లు తమ ఓటు అవకాశాన్ని వినియోగించుకునే విధంగా రాజకీయ పార్టీలు సహకరించాని కోరారు. సమావేశంలో డీపీవో భిక్షపతి, జడ్పీ సీఈఓ లక్ష్మీనారాయణ, డీఎల్పీవో ఉమర్హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
భవనాలను త్వరగా గుర్తించాలి
ఆసిఫాబాద్రూరల్, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గురుకుల పాఠశాల, కళాశాల నిర్వహణకు భవనాలను త్వరగా గుర్తించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో శుక్రవారం కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధశుక్లాతో కలిసి సాంఘిక సంక్షేమ గురుకులాల అధికారులు, మున్సిపల్ అధికారులు, రోడ్లు భవనాల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్టాడుతూ ఇటీవల సిర్పూర్(టి) మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురకుల పాఠశాల, కళాశాల భవనం శిథిలావస్థలో ఉన్నదని అన్నారు. దీంతో అక్కడి విద్యార్థులను ఉమ్మడి జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సర్దుబాటు చేశామని వివ రించారు. విద్యార్థులకు విద్యా సంవత్సరం ఆటంకం కలగకుండా కాగజ్నగర్ పట్టణంలోని బాలాజీనగర్లో గల సుప్రభాత్ పాఠశాల భవనంలో పాఠశాల, కళాశాల కొనసాగించేందుకు అవసరమైన భవన సదుపాయం కోసం చర్యలు తీసుకోవాలని సూచించారు. సిర్పూర్(టి) సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో దాదాపు 500 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని అన్నారు. వారికి సరపడా భవన సదుపాయం, తరగతి గదులు, వంట శాల, తాగునీరు, మరుగుదొడ్లు, స్నానాల గదులు ఉండేలా చూసి నివేదికలు అందించాలని తెలిపారు. ఆయా ప్రాంతాలలో ఉండే అద్దె వివరాలు అందించాలని సూచించారు. సమావేశంలో వరంగల్ జోనల్ అధికారి అరుణకుమారి, తదితరులు పాల్గొన్నారు.