Share News

యాదగిరీశుడికి శాస్త్రోక్తంగా నిత్యపూజలు

ABN , Publish Date - May 22 , 2025 | 12:31 AM

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దివ్య క్షేత్రంలో బుధవారం నిత్య పూజలు వైభవంగా నిర్వహిం చారు.

యాదగిరీశుడికి శాస్త్రోక్తంగా నిత్యపూజలు

యాదగిరిగుట్ట, మే 21 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దివ్య క్షేత్రంలో బుధవారం నిత్య పూజలు వైభవంగా నిర్వహిం చారు. సుప్రభాతంతో స్వామి అమ్మవారిని మేల్కొలిపిన అర్చకులు గర్భగుడిలో కొలువుదీరిన స్వయంభువులను, సువర్ణ ప్రతిష్టామూర్తులను అభిషేకరించి తులసీదళాలతో సహస్రనార్చనలు నిర్వహించారు. ప్రధానాలయం అష్టభుజి ప్రాకార మండపంలో అలంకరించి ప్రత్యేక వేదికపై తీర్చిదిద్ది సుదర్శన శతక పఠనాలతో హవనం నిర్వహించారు. అనంతరం గజవాహన సేవలో ఊరేగించి విశ్వక్సేనుడి తొలిపూజలతో నిత్య తిరుకల్యాణోత్సవ పర్వాలు ఆగమశాస్త్రరీతిలో నిర్వహించారు. సాయంత్రం ముఖమండపంలో దర్బారు సేవోత్సవం చేపట్టిన ఆచార్యులు అంకార వెండిజోడు సేవలు, సహస్రనార్చనలు నిర్వహించారు. పాతగుట్ట ఆలయంలో వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ నిత్య పూజలు కొనసాగాయి. కొండపైన శివాలయంలో శ్రీపర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామికి రుద్రహవనం శైవాగమ పద్దతిలో నిర్వహించారు. వివిధ విభాగాల ద్వారా ఆలయ ఖజానాకు రూ. 21,79,447 ఆదాయం సమకూరినట్లు ఈవో ఎస్‌. వెంకట్రావు తెలిపారు. కొండపైన మధ్యాహ్నం రెండు గంటల సమయంలో అప్పటి వరకు ఉక్కపోతగా ఉండి ఒక్కసారిగా అకాశంలో మబ్బులు కమ్మి సుమారు 20 నిమిషాల పాటు వర్షం కురిసింది.

మఠంపల్లి: మట్టపల్లి లక్ష్మీనరసింహుని క్షేత్రంలో స్వామివారి నిత్యకల్యాణాన్ని వేదపండితులు వైభవంగా నిర్వహించారు. విశ్వక్ష్సేన పూజ, పుణ్యాహావాచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, పంచగవ్వప్రాసన అనంతరం స్వామివారికి మాంగళ్యధారణ తలంబ్రాలుతో నిత్య కల్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త చెన్నూరి విజయ్‌కుమార్‌, మట్టపల్లిరావు, ఈవో సిరికొండనవీన్‌, అర్చకులు తూమాటి శ్రీనివాసాచార్యులు, పద్మనాభాచార్యులు, కృష్ణామాచార్యులు, రామాచార్యులు, ఫణిభూషణమంగాచార్యులు, సీతరామశాస్ర్తీ, శేషగిరిరావు పాల్గొన్నారు.

Updated Date - May 22 , 2025 | 12:31 AM