శాస్త్రోక్తంగా నిత్య పూజలు
ABN , Publish Date - Jun 12 , 2025 | 12:43 AM
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో బుధవారం నిత్య పూజలు వైభవంగా నిర్వహించారు.
యాదగిరిగుట్ట, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో బుధవారం నిత్య పూజలు వైభవంగా నిర్వహించారు. సుప్ర భాతంతో స్వామి అమ్మవారిని మేల్కొలిపిన అర్చకులు గర్భగుడిలో కొలువుదీరిన స్వయంభువులు, సువర్ణ ప్రతిష్టామూర్తులను అభిషేకించారు. ప్రధానాలయం అష్టభుజి ప్రకార మండపంలో స్వామిఅమ్మవారిని అలంకరించి ప్రత్యేక వేదికపై తిర్చిదిద్ది సుదర్శన శతక పఠనాలతో హవనం నిర్వహించారు. అనంతరం గజ వాహన సేవలో ఊరేగించి విశ్వక్సేనుడి తొలి పూజలతో నిత్య తిరుకల్యాణోత్సవం నిర్వహించారు. సాయంత్రం ముఖ మండపంలో దర్భారు సేవోత్సవం చేపట్టిన ఆచార్యులు అలంకార వెండిజోడు సేవలు, సహస్ర నామార్చనలు నిర్వహిం చారు. పాతగుట్ట ఆలయంలో వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నిత్యపూజలు కొనసాగాయి. కొండపైన శివాలయంలో పర్వతవర్థిని రామ లింగేశ్వర స్వామికి రుద్రహవనం నిర్వహించారు. ఆలయ ఖజానాకు వివిధ విభాగాల ద్వారా రూ.25,88,516 ఆదాయం సమకూరినట్లు ఈవో ఎస్ వెంక ట్రావు తెలిపారు. కాగా, స్వామివారి హుండీని గురువారం కొండ కింద వ్రత మండపంలో ఉదయం 7గంటల నుంచి లెక్కించనున్నారు.
వైభవంగా లక్ష్మీనరసింహుడి కల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి లక్ష్మీనరసింహుని క్షేత్రంలో స్వామివారి నిత్య కల్యాణాన్ని వేదపండితులు బుధవారం వైభవంగా నిర్వహించారు. ఆలయంలో విశ్వక్ష్సేన పూజ, పుణ్యాహావాచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, పంచగవ్వప్రాసన అనంతరం స్వామివారికి మాంగళ్యధారణ తలంబ్రాలతో నిత్య కల్యాణాన్ని వైభవంగా జరిపించారు .అనంతరం భక్తులకు నీరాజనమంత్రపుష్పాలతో మహానివేధన గావించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు చెన్నూరి విజయ్కుమార్, మట్టపల్లిరావు, ఈవో సిరికొండనవీన్, ఆలయ అర్చకులు తూమాటిశ్రీనివాసాచార్యులు, పధ్మనాభాచార్యులు, కృష్ణామాచార్యులు, రామాచార్యులు, ఫణిభూషణమంగాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి,సీతరామశాస్ర్తీ, శేషగిరిరావు, రాజేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.